సినిమా కష్టాలు షిఫ్ట్ అయ్యాయా.?

Tollywood faces new troubles as Telangana stops movie ticket hikes

సిని’మా’ కష్టాలు సీరియల్ కష్టాల మాదిరి ఒకటి పోతే మరొకటి అనే చందంగా కొనసాగుతూనే వస్తున్నాయి. సీరియల్ లో అత్త పోరు పోతే ఆడపడుచు తగులుకున్నట్టు ఇక్కడ సినీ పరిశ్రమకు కూటమి రాకతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తో సమస్య సద్దుమణిగితే అక్కడ తెలంగాణలో టిక్కెట్ రేట్ల సమస్య మొదటికొచ్చింది.

వైసీపీ ప్రభుత్వ హయాంలో ముఖ్యమంత్రిగా జగన్ అనుసరించిన విధానాలు సినీ పరిశ్రమను అతలాకుతలం చేసాయి, సినీ పరిశ్రమ పెద్దలను తాడేపల్లి ప్యాలస్ వరకు రప్పించాయి. పేదలకు అందుబాటులో వినోదం అంటూ జగన్ మొదలుపెట్టిన టికెట్ రేట్ల పంచాయితీ ఇప్పుడు వైసీపీ ఓటమితో ఏపీలో పూర్తిగా సద్దుమణిగిపోయింది.

ADVERTISEMENT

దీనితో సినీ పరిశ్రమకు ఏపీలో లైన్ క్లియర్ అవ్వగా ఇప్పుడు తాజాగా అదే సమస్య తెలంగాణలో మొదలయ్యింది. పుష్ప సినిమా ప్రీమియర్ షో లతో మొదలైన సమస్య అంచలంచెలుగా పెరుగుతూ నేడు అఖండ రిలీజ్ వరకు సాగుతూ వచ్చింది.

ఇక ఇప్పుడు తాజాగా తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇక తెలంగాణలో సినిమా టికెట్ రేట్లు పెంచేదే లేదు అంటూ కుండ బద్దలు కొట్టారు. ఇక నుంచి సినిమా రిలీజ్ సమయంలో టికెట్ రేట్లు పెంచాలి అంటూ మూవీ నిర్మాతలు, దర్శకులు మా దగ్గరకు రావొద్దంటూ నిర్మొహమాటంగా తేల్చి చెప్పేసారు.

గతంలో కూడా రేవంత్ సర్కార్ ఇదే విధంగా మూవీ టికెట్ రేట్ల విషయంలో, మూవీ ప్రీమియర్ షో ల అంశంలోనూ ఇటువంటి ప్రకటనలే చేసినప్పటికీ అవి పూర్తిగా అమలులోకి రాలేకపోయాయి.

కానీ ఈ మధ్య కాలంలో రిలీజ్ అయిన రెండు పెద్ద సినిమాలు పవన్ OG, బాలకృష్ణ అఖండ -2 రిలీజ్ సమయంలో టికెట్ రేట్ల పెంపు విషయమై తెలంగాణ హై కోర్ట్ లో జరిగిన వాదనలు సినీ పరిశ్రమకు వ్యతిరేకంగా వచ్చాయి. తద్వారా రేవంత్ సర్కార్ సైతం వైసీపీ వాదనకు కట్టుబడి హీరోల కు అంతంత రెమ్యునరేషన్లు ఇవ్వడం ఎందుకు.?

బడ్జెట్ పెరిగింది అంటూ రేట్లు పెంచమనడం ఎందుకు.? అసలు హీరోలకు అంత రెమ్యునరేషన్ ఎవరు ఇవ్వమన్నారు.? అంటూ సినీ పరిశ్రమ పై వైసీపీ మాదిరి ఎదురుదాడి మొదలు పెట్టారు కోమటిరెడ్డి.

అయితే ఈ విషయంలో గతంలో సినీ పరిశ్రమ వైపు నిలబడ్డ టాలీవుడ్ ప్రేక్షకుడు, సాధారణ సినీ అభిమాని ఇప్పుడు తమ మద్దతు మార్చుకోవడానికి సిద్దమయ్యారా.? అన్నది కూడా ఒకసారి ఇండస్ట్రీ పెద్దలు ఆలోచించాలి.

ADVERTISEMENT
Latest Stories