ఓట్లు కోసం హామీలు ఇస్తే ఆ తర్వాత అవే ప్రభుత్వాలకు గుదిబండలుగా మారుతాయని పదేపదే నిరూపితం అవుతూనే ఉంది. కానీ ఈ హామీల రేసులో వెనుకబడిపోతే ఎప్పటికీ ఎన్నికలలో గెలవలేము… అధికారంలోకి రాలేము… కనుక గెలిచి అధికారంలోకి వస్తే అప్పటి సంగతి అప్పుడు చూసుకోవచ్చని ఎడాపెడా హామీలు ఇచ్చేస్తున్నాయి. కనుక అధికారంలోకి రాగానే ఆ గుదిబండలు మోయక తప్పడం లేదు.
తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ ‘తెలంగాణ సెంటిమెంటు’తో కాంగ్రెస్ పార్టీని ముప్ప తిప్పలు పెడుతోంది. కనుక దానికి విరుగుడుగా’ బీసీ రిజర్వేషన్స్’ తెరపైకి తెచ్చింది. కానీ అవి అమలు చేయాలంటే పార్లమెంటులో చట్ట సవరణ చేయాలి. కేంద్రం ఆమోదించాలి… అని కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండు పార్టీలకి బాగా తెలుసు. కనుక ఇప్పుడు ఆ పేరుతో రెండు పార్టీలు ‘పవర్ ప్లే’సాగిస్తూ ఒకదానిపై మరొకటి పైచేయి సాధించాలని ప్రయత్నిస్తున్నాయి.
కనుక బీఆర్ఎస్ పార్టీని కాళేశ్వరం నివేదికతో చెక్ పెట్టాలని సిఎం రేవంత్ రెడ్డి అనుకుని నేడు శాసనసభలో ప్రవేశపెట్టారు. దాంతో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ముందుకు వెళ్ళనిస్తే తర్వాత ఏమవుతుందో బీఆర్ఎస్ పార్టీకి బాగా తెలుసు. కనుక శాసనసభ సమావేశాలలో వరదలు, పంట నష్టం, యూరియా కొరత, ఎన్నికల హామీల అమలులో వైఫల్యం తదితర అంశాలను లేవనెత్తి వాటిపై చర్చకు పట్టుబడుతోంది.
ఈవిదంగా బీఆర్ఎస్ పార్టీ కాలికేస్తే మెడకు… మెడకేస్తే కాలికేస్తూ రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ముప్ప తిప్పలు పెడుతూనే ఉంది. కానీ ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం, అటు బీఆర్ఎస్ పార్టీ రెండింటికీ దేని బలహీనతలు దానికే ఉన్నాయి.
కాళేశ్వరం కమీషన్ నివేదికతో కేసీఆర్ మీద చట్ట పరమైన చర్యలు తీసుకునేందుకు సిఎం రేవంత్ రెడ్డి సిద్దమవుతున్నారు. కానీ కేసీఆర్ని అరెస్ట్ చేయగలరా? ఈ కేసులో దోషిగా నిరూపించి రాజకీయంగా దెబ్బ తీయగలరా? అంటే ఫోన్ ట్యాపింగ్ కేసు, రేసింగ్ కేసుల నేపధ్యంలో చూస్తే కాదనే అర్ధమవుతోంది.
అలాగని కేసీఆర్ శాసనసభకు రాకుండానే రేవంత్ రెడ్డిని ముప్పతిప్పలు పెడుతున్నారు కనుక ఏమైనా చేయగలిగారా? అంటే మూడు లేదా ఆరు నెలల్లో కూల్చేస్తామన్నారే కానీ ఏమీ చేయలేకపోయారు కదా?కనుక ఎన్నికల హామీలను ప్రశ్నిస్తూ బీఆర్ఎస్ పార్టీ, బీసీ రిజర్వేషన్స్, కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రాజకీయ చదరంగం ఆడుకుంటూనే ఉంటాయి తప్ప ఒక పార్టీని మరొకటి ఏమీ చేయలేవు…. మద్యలో బీజేపి పావులు కదపడం మొదలుపెడితే తప్ప!





