
తెలంగాణలో కాంగ్రెస్, బిఆర్ఎస్ పార్టీలు రాజకీయాలు చేసుకుంటే ప్రజలకు అభ్యంతరం లేదు. కానీ వాటి రాజకీయాలతో ప్రజలకు కూడా పరీక్ష పెడుతున్నాయి. తెలంగాణ తల్లి విగ్రహం గురించి రెండు పార్టీల మద్య రచ్చ రచ్చ జరుగుతోంది.
కేసీఆర్ రూపొందించిన తెలంగాణ తల్లి విగ్రహం రాజరిక పోకడలతో, ఆయన కుమార్తె రూపురేఖలతో ఉందని రేవంత్ రెడ్డి ఇది వరకు ప్రతిపక్షంలో ఉన్నప్పుడే ఆరోపించేవారు. తాము అధికారంలోకి రాగానే మార్పించేస్తామని చెప్పేవారు. చెప్పిన్నట్లుగానే కొత్త రూపు రేఖలతో తెలంగాణ తల్లి విగ్రహం తయారు చేయించి డిసెంబర్ 9న సచివాలయం ఆవరణలో ప్రతిష్టించబోతున్నారు.
Also Read – ఉచితం సముచితం కాదు కానీ తప్పదుగా!
కొత్త విగ్రహం సాధారణ తెలంగాణ మహిళకు ప్రతిరూపంగా చాలా నిరాడంబరంగా ఉంది. పోరాటాలతో తెలంగాణ ఏర్పడిందని సూచిస్తూ దిగువన నీలిరంగు పీఠం చుట్టూ మూసిన పిడికిలి బొమ్మలున్నాయి.
తెలంగాణ తల్లి విగ్రహం రూపురేఖలు మార్చడంపై కేటీఆర్ భగ్గుమన్నారు. “అది తెలంగాణ తల్లా లేక కాంగ్రెస్ తల్లా? ప్రభుత్వం మారినప్పుడల్లా విగ్రహాలు, నంబర్ ప్లేట్లు అన్నీ మారిపోతాయా?” అని ప్రశ్నించారు. తాము మళ్ళీ అధికారంలోకి రాగానే ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏర్పాటు చేస్తున్న కొత్త విగ్రహం తొలగించి మళ్ళీ పాత విగ్రహం పెడతామని కేటీఆర్ హెచ్చరించారు.
Also Read – భారత్ క్షిపణు దాడులు నిజమే: ఒప్పేసుకున్నారు!
కేసీఆర్ తయారు చేయించిన తెలంగాణ తల్లి విగ్రహం రూపురేఖలు కల్వకుంట్ల కవితని పోలి ఉన్నాయని రేవంత్ రెడ్డి ఆరోపిస్తే, ఇప్పుడు రేవంత్ రెడ్డి చేయించిన విగ్రహం రూపురేఖలు ఆయన సతీమణిని పోలి ఉన్నాయంటూ అప్పుడే సోషల్ మీడియాలో వాదనలు, విమర్శలు మొదలైపోయాయి.
ప్రభుత్వం మారితే విగ్రహం మార్చాలా? అని ప్రశ్నిస్తున్న కేటీఆర్ తాము అధికారంలోకి రాగానే మార్చేస్తామని చెపుతున్నారు. అందరికీ పూజ్యనీయమైన తల్లి విగ్రహంపై కాంగ్రెస్, బిఆర్ఎస్ పార్టీలు చేస్తున్న ఈ రాజకీయాలతో తెలంగాణ ప్రజలకు కూడా అగ్ని పరీక్షగా మారాయని చెప్పక తప్పదు. మరి ప్రజలు ఏమంటారో?