ఇటీవలే జరిగిన తెలంగాణ ఎన్నికలలో తెరాస భారీ మెజారిటీతో గెలిచింది. ఈ గెలుపులో చాలా మంది భారీగా మెజారిటీలతో గెలిచి ఇప్పుడు మంత్రి పదవులు ఆశిస్తున్నారు. అయితే రాజ్యాంగం ప్రకారం తెలంగాణాలో 17 మందికి మించి మంత్రులు ఉండటానికి వీలు లేదు. దీనితో పోటీని తట్టుకోడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక కొత్త ప్లాన్ తో ముందుకు వచ్చారు. పార్లమెంటరీ రాజకీయ కార్యదర్శుల పేరుతో కొంత మంది ఎమ్మెల్యేలకు పదవులు ఇవ్వబోతున్నారు.
వీరికి కూడా క్యాబినెట్ హోదా ఉంటుంది. మంత్రి హోదా ఉండదు కాని మంత్రులకు సలహాదారులుగా ఉంటారు. అసెంబ్లీలో మంత్రులు లేకపోతే వారు జవాబు ఇచ్చే విదంగా ఆదేశాలు ఇస్తారట. మంత్రిమండలి సమావేశాల్లో వీరు పాల్గొనే వీలుండదు. ప్రమాణ స్వీకారం లేకుండానే పదవులు చేపడతారు. చత్తీస్ గడ్ లో ఈ వ్యవస్థ ఉందని,దానికి అనుగుణంగానే దీనిని తయారు చేశారని అంటున్నారు. మంత్రివర్గ విస్తరణతో పాటు ఈ పదవులు కూడా ఇస్తారట. గతంలో పార్లమెంటరీ కార్యదర్శుల ఇస్తే హై కోర్టు ఆ నియామకాలను కొట్టేసింది.
దీనితో వేరే మార్గంలో ఈ పదవులను భర్తీ చేసే ప్రయత్నం చేస్తున్నారు. దీనికి సంబంధించి ఒక ఆర్డినెన్సు తెచ్చే యోచనలో ఉంది తెలంగాణ ప్రభుత్వం. ఈ నెల 18న మంత్రివర్గ విస్తరణ ఉండొచ్చని సమాచారం. సీఎం కేసీఆర్ దీనిని అధికారికంగా ధృవీకరించాల్సి ఉంది. దీనిపై సీఎం కేసీఆర్ ఇప్పటికే కసరత్తు చేస్తున్నారు. రెండు దఫాలుగా మంత్రివర్గ విస్తరణ ఉంటుందని సమాచారం. ఈ నేపథ్యంలో మొదటి విడతలో ఎనిమిది మందికి అవకాశం ఇస్తారనే ప్రచారం జరుగుతోంది. ఖమ్మం మినహా మిగిలిన జిల్లాల నుంచి ప్రాతినిధ్యం ఉండే అవకాశం ఉందని సమాచారం.



