తెలంగాణ రాష్ట్రంలో సిఎం కేసీఆర్ రాజకీయ ఆధిపత్యానికి, బిఆర్ఎస్ పార్టీకి బిజెపి గట్టిగా సవాలు చేయగలుగుతోంది. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేస్తున్న అవిశ్రాంత పోరాటాలు, కేసీఆర్కి తీసిపోని విధంగా అమలుచేస్తున్న వ్యూహాలతో బిజెపిని బిఆర్ఎస్కి ప్రత్యామ్నాయంగా ఎదిగేలా చేసి ఈ విషయాన్ని ప్రజలు కూడా గుర్తించేలా చేయగలిగారు. వచ్చే ఎన్నికలలో బిఆర్ఎస్ని ఓడించి కేసీఆర్ని గద్దె దించుతామని, తెలంగాణలో బిజెపి అధికారంలోకి వస్తుందని నమ్మకంగా చెపుతున్నారు. ఆయన ప్రయత్నాలు ఫలిస్తాయో లేదో తెలీదు కానీ తెలంగాణలో కేసీఆర్కి బిజెపి ముచ్చెమటలు పట్టిస్తోందనేది వాస్తవం.
కానీ ఏపీలో బిజెపి పరిస్థితి అందుకు పూర్తి భిన్నంగా ఉంది. వైసీపీని గట్టిగా ఎదిరించలేకపోతోంది. మిత్రపక్షమైన జనసేనతో కలిసి పనిచేయలేకపోతోంది. ఏపీ బిజెపి వైఖరికి విసిగెత్తిపోయి ఆ పార్టీ సీనియర్ నాయకుడు కన్నా లక్ష్మినారాయణ వంటి సీనియర్ నేత నేడు బిజెపిని వీడి టిడిపిలో చేరబోతున్నారు.
వైసీపీ పాలనలో ఆంధ్రప్రదేశ్ పరిస్థితి రాజకీయంగా, ఆర్ధికంగా, శాంతిభద్రతలపరంగా కూడా నానాటికీ దిగజారిపోతున్నా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడం, మూడు రాజధానులంటూ హడావుడి చేస్తున్న వైసీపీ నేతలని రాష్ట్ర బిజెపి ఎదుర్కోకపోవడం, కేంద్ర ప్రభుత్వం కట్టడి చేయకపోవడంతో ఏపీ ప్రజలు బిజెపిపై తీవ్ర అసహనంగా ఉన్నారు. కనుక ఈసారి కూడా బిజెపి నేతలు తమ సొంత బలంతోనే గెలిస్తే గెలవాలి తప్ప బిజెపిని, ప్రధాని నరేంద్రమోడీ చూసి ఏపీ ప్రజలు ఓట్లు వేయరనేది బహిరంగ రహస్యం.
అటువంటి పార్టీతో బిఆర్ఎస్ పార్టీ పోటీ పడుతుందని ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ చెప్పుకోవడం రాజకీయ అజ్ఞానమే అనుకోవాలి. తమ పార్టీ ఏపీలో అన్ని స్థానాలలో పోటీ పడుతుందని, కులమతాలు పేరుతో ప్రజలని రెచ్చగొడుతున్న బిజెపితోనే తమకి పోటీ అని తోట చంద్రశేఖర్ చెప్పుకొన్నారు. కనీసం నోటాకి పడినన్ని ఓట్లు కూడా సాధించలేక చతికిలపడుతున్న బిజెపితో బిఆర్ఎస్ పోటీ పడుతుందని చెప్పుకోవడం ద్వారా ఏపీలో బిఆర్ఎస్ శక్తిసామర్ధ్యాలు ఏపాటివో తోట చంద్రశేఖర్ స్వయంగా బయటపెట్టుకొన్నారు.



