
టీటీడీ నిర్లక్ష్యం కారణంగా గోశాలలో వందలాది ఆవులు చనిపోతున్నాయంటూ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఆరోపణలు చేస్తూ చనిపోయిన ఓ ఆవు ఫోటో సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో మళ్ళీ టీడీపీ-వైసీపీల మద్య రాజకీయాలు భగ్గున మండాయి.
Also Read – ఈ పెద్దాయన అమృతం తాగారా.. ఏంటా దూకుడు?
తన ఆరోపణలు నిరూపిస్తానని ఆయన, వచ్చి నిరూపించాలని టీడీపీ నేతలు సవాళ్ళు ప్రతి సవాళ్ళు చేసుకున్న తర్వాత, గురువారం ఉదయం నుంచి సాయంత్రం వరకు తిరుపతి పట్టణంలో జరిగిన డ్రామాలు అందరికీ తెలుసు. కనుక ఇప్పుడు ఆ రీవైండ్ అవసరం లేదు.
ఈ నేపధ్యంలో ఈ గోశాల రాజకీయాలలో ఎవరు పైచేయి సాధించారు? అని ప్రశ్నించుకుంటే తిరుపతి పట్టణంలో నడిరోడ్డుపై కూర్చొని రోజా, భూమన కరుణాకర్ రెడ్డి చేసిన డ్రామాలే ప్రజలను ఎక్కువగా ఆకర్షిస్తాయని అర్దమవుతుంది.
Also Read – రాయలసీమ దశ తిరుగబోతోందా?
సినీ నటిగా, మంచి నోరున్న నాయకురాలిగా రాష్ట్ర ప్రజలకు సూపరిచితురాలైన ఆమెకు ధీటుగా జవాబు చెప్పగల టీడీపీ నాయకుడు లేదా మంత్రి చేత సమాధానాలు చెప్పించి ఉంటే ఈవిదంగా జరిగి ఉండేది కాదు. కానీ టీడీపీ ఎమ్మెల్యేలతో చెప్పించడం వలన మీడియాలో ఆమె గొంతే ప్రధానంగా వినబడింది.
భూమన కరుణాకర్ రెడ్డి చేసిన ఆరోపణలు చాలా తీవ్రమైనవి. వాటితో భక్తుల మనోభావాలు దెబ్బతింటున్నాయి. టీటీడీ, కూటమి ప్రభుత్వం ప్రతిష్టకి భంగం కలిగిస్తున్నాయి.
Also Read – కొడాలి నానిని జగన్ పరామర్శించకపోయినా పోలీసులు..
తెలంగాణలో కంచ గచ్చిబౌలి భూములపై ఏఐ ఫోటోలతో పోస్టులు పెట్టి ప్రజలను రెచ్చగొట్టేందుకు ప్రయత్నించిన వారిపై తెలంగాణ ప్రభుత్వం ఆదేశం మేరకు గచ్చిబౌలి పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారు. వారిలో ఐఏస్ అధికారిని స్మితా సభర్వాల్ కూడా ఉన్నారు. ఆమెను కూడా సంజాయిషీ కోరుతూ పోలీసులు నోటీసులు పంపారు.
నకిలీ ఫోటోలు పెట్టినందునే తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నప్పుడు, చనిపోయిన ఆవు ఫోటో పెట్టి తీవ్ర ఆరోపణలు చేస్తున్న భూమన కరుణాకర్ రెడ్డికి పోలీసులు ఎందుకు నోటీస్ ఇవ్వలేదు?
గోశాలలో ఆవులు చనిపోతున్నాయని సాక్ష్యాధారాలు సమర్పించాలని పోలీసులు నోటీస్ ఇవ్వవచ్చు కదా? ఒకవేళ ఆయన తన ఆరోపణలు నిరూపించలేకపోతే అప్పుడు చట్ట ప్రకారం ఆయనపై చర్యలు కూడా తీసుకునేందుకు వీలు కలిగేది కదా?
కానీ ఈ వ్యవహారంలో టీడీపీ ఆయనని రాజకీయంగా ఎదుర్కోవాలని అనుకుంది కనుక పోలీసులు జోక్యం చేసుకోలేదని సరిపెట్టుకున్నా, టీడీపీ వారిని ధీటుగా ఎదుర్కోలేకపోవడంతో నిన్న రోజంతా మీడియాలో రోజా గొంతే ఎక్కువగా వినిపించింది.
ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ఆయన కుమారుడు మార్క్ శంకర్ అగ్నిప్రమాదం గురించి రోజా అంతగా రెచ్చిపోయి నోటికి వచ్చిన్నట్లు మాట్లాడుతున్నా టీడీపీ, జనసేనలు ఆమెను ధీటుగా ఎదుర్కోలేకపోయాయి. కనుక టీటీడీ గోశాల పేరుతో జరుగుతున్న రాజకీయాలలో టీడీపీపై వైసీపీపై చేయి సాధించిందని చెప్పక తప్పదు.
కనీసం ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం ఈ వ్యవహారంలో చట్ట ప్రకారం ముందుకు సాగి భూమన కరుణాకర్ రెడ్డి ఆరోపణలు తప్పని నిరూపించగలిగితే మంచిది. లేకుంటే ఆయన చేసిన ఆరోపణలు నిజమేనని టీటిడీ తప్పులను కూటమి ప్రభుత్వం దాచిపెడుతోందని యావత్ రాష్ట్ర ప్రజలు నమ్మే ప్రమాదం ఉంటుంది.