ఏడుకొండల పైన స్వయంభువుగా వెలసిన దేవదేవుడు శ్రీ వేంకటేశ్వరుని బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా సాగుతున్నాయి. ప్రపంచంలోనే అత్యధిక సంఖ్యలో భక్తులు సందర్శించే దేవాలయంగా కీర్తి గడించిన తిరుమల శ్రీవెంకటేశ్వరాలయం ఎన్నో విశిష్టతలను సొంతం చేసుకుంది. వెంకన్న పేరిట తక్కువలో తక్కువగా 4,500కు పైగా ఎకరాల భూమి రిజిస్టరై ఉండగా, వివిధ బ్యాంకుల్లో 9,500 కోట్ల డిపాజిట్లు ఉన్నాయి. వీటిపై ఏడాదికి 800 కోట్లు వడ్డీ రూపంలో స్వామి వారి ఖాతాలో జమ అవుతోంది.
హుండీ నుంచి రోజుకు సగటున సుమారు 3 కోట్లు రూపాయలు వసూలు అవుతోంది. ఒక రోజు రికార్డు కలెక్షన్ 5.73 కోట్లు. నిత్యమూ తిరుమలలో జరిగే వ్యాపారం విలువ 2 కోట్లు కాగా, టోపీలు, ఫోటోల వ్యాపారమే 70 లక్షల వరకూ ఉంటుందని అంచనా. స్వామి వారికి రోజూ 120 రకాల ఆభరణాలతో అలంకారం. స్వామికి అలంకరించే బంగారు పీతాంబరం బరువు 40 కిలోలు. స్వామి వద్ద అత్యంత అరుదైన గరుడమేరు పచ్చ ఉంది. ఉత్సవాల్లో మాత్రమే దీనిని అలంకరిస్తారు.
స్వర్ణ రథం తయారీకి 74 కిలోల బంగారాన్ని వాడారు. నిత్యమూ 7 కిలోల వరకూ బంగారం, వెండి కానుకలు స్వామి హుండీలో చేరుతాయి. ఆసియాలో అతి పెద్ద వంటశాల తిరుమలలో ఉంది. రోజుకు లక్ష మంది ఇక్కడ అన్న ప్రసాదాన్ని తీసుకుంటారు. స్వామి అలంకరణ కోసం రోజూ 15 వేల కిలోల పూలు దేశ విదేశాల నుంచి వస్తాయి. ప్రస్తుతం బ్రహ్మోత్సవాల అలంకరణలో ఈ పూల డెకరేషన్ ను వీక్షించవచ్చు. 200 మంది ఈ పూలను కట్టి స్వామి వారికి సహా, పలు వసతి భవనాలు, కాటేజీల్లో అలంకరణకు వాడుతారు.
నిత్యమూ నాలుగు లక్షల వరకూ లడ్డూలను తయారు చేస్తుంటారు. 24 గంటలూ తెరచివుండే కల్యాణ కట్టలో 700 మంది క్షురకులకు విధులు. గత సంవత్సరం తలనీలాల ఆదాయం 150 కోట్లు. స్వామి వారి హుండీ ఆదాయాన్ని లెక్కించేందుకు రోజుకు 90 మందికి విధులు. స్వామి వారి వద్ద ఉన్న బంగారు ఆభరణాల బరువు 13 వేల కిలోలకు పైగానే. మామూలుగానే నిత్యం కళకళలాడుతూ కనిపించే తిరుమల, ప్రస్తుతం బ్రహ్మోత్సవాల సమయం కావడంతో, మరింత సౌందర్య శోభగులతో భక్తులకు దర్శనమిస్తోంది.


