డ్రగ్స్ కేసు… కధ కంచికి… సెలబ్రిటీలు ఇంటికి..?

Tollywood Drugs Case investigation ends todayగత నెల రోజులుగా టాలీవుడ్ సెలబ్రిటీలకు కంటి మీద కునుకు లేకుండా చేసిన డ్రగ్స్ కేసు విచారణ తుది దశకు చేరుకుంది. గాయని గీతామాధురి భర్త నందు విచారణతో సెలబ్రిటీల విచారణతో ఈ హంగామా ముగియనుంది. మరి దీని తర్వాత ఏం జరగనుంది? ఇటీవల మీడియా వర్గాలలో ప్రసారం చేసినట్లుగా కొందరు సినీ ప్రముఖులను అదుపులో తీసుకునే అవకాశాలు ఉంటాయా? లేక ఈ సారికి సినీ ప్రముఖులు బయటపడ్డట్లేనా? ఇలాంటి అనేక ప్రశ్నలకు మరో మూడు, నాలుగు రోజుల్లో సిట్ అధికారుల నుండి అధికారిక సమాచారం లభించవచ్చు.

ADVERTISEMENT

అయితే ఇప్పటివరకు ఏ మీడియా ఛానల్స్ అయితే ఈ కేసులో ఓ హీరో, దర్శకుడు అరెస్ట్ తప్పదంటూ కధనాలు ప్రసారం చేసిందో, అదే మీడియా ఛానల్ ప్రస్తుతం ఈ కేసులో సినీ ప్రముఖులందరికీ ఊరట లభించినట్లేనన్న అంచనాలు వేస్తోంది. ఈ కేసులో ఇప్పటివరకూ ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్న కెల్విన్, జిశాన్, మైక్ కమింగాలు సహా మొత్తం 20 మందిని అరెస్ట్ చేసిన అధికారులు త్వరలో వారిపై చార్జ్ షీట్ వేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారన్న టాక్ తో, ఈ కేసులో సెకండ్ జాబితా లేదన్న విషయం హైలైట్ అవుతోంది.

ఇప్పటివరకూ 11 మంది సినీ ప్రముఖులను దాదాపు 88 గంటల పాటు విచారించిన సిట్ అధికారులు, అరెస్టయిన నిందితులకు, వీరికి ఉన్న సంబంధాలను ఎంతవరకు చేధించిందో అన్న సమాచారం బయటకు రాకపోవడమే ఈ ఊహాగానాలకు తెరలేపినట్లయ్యింది. మరి ఈ విచారణ వలన ప్రయోజనం ఏంటి? అంటే ఈ ప్రముఖులందరినీ సాక్షుల జాబితాలో పేర్కొనే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ కేసులో మొత్తం 29 మందిని సాక్షులుగా చేర్చాలని భావిస్తున్నామని, తమకు అప్పగించిన పని ముగిసినట్టేనని ఓ సిట్ అధికారి తెలిపారు.

ఈ కేసులో చార్జ్ షీట్ దాఖలుకు సంబంధించిన పనులు ప్రారంభిస్తున్నామని చెప్పడంతో ఈ కథ కంచికి… సెలబ్రిటీలు ఇంటికి చేరినట్లేనన్న వాదనకు క్రమంగా బలం చేకూరుతోంది. ఓ పక్కన విచారణ జరుగుతున్నపుడు… కీలక సమాచారం లభించిందని మీడియా వర్గీయులకు లీకులు రాగా, ప్రస్తుతం అదే మీడియా వర్గాలలో ఈ కేసులో సినీ ప్రముఖులకు సంబంధించి ఎలాంటి ఆధారాలు దొరకలేదని ప్రసారం చేయడం వెనుక ఆంతర్యం ఏమిటో అతి త్వరలో తెలియనుంది.

ADVERTISEMENT
Latest Stories