కేసీఆర్‌కు లేని శత్రువులు జగన్‌కు మాత్రమే ఉన్నారా?

Trees Cut Down For CM Jagan Tour ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రులు ఇద్దరికీ చాలా మందే రాజకీయ శత్రువులున్నారు. అది సహజం కూడా. ఇక్కడ ఏపీలోనైనా అక్కడ తెలంగాణలోనైనా వారి రాజకీయ శత్రువులు దీక్షలు, ధర్నాలు, సభలు, రోడ్ షోలలో విమర్శలు, ఆరోపణలకే పరిమితం అవుతున్నారు తప్ప ఏనాడూ భౌతికదాడులకు ప్రయత్నించిన దాఖలాలు లేవు.

కానీ ఏపీలో వైసీపీ నేతలే ప్రతిపక్ష పార్టీ కార్యాలయాలపై, వాటి నేతలు, కార్యకర్తలపై అడపాదడపా దాడులు చేస్తుండటం అందరూ చూస్తూనే ఉన్నారు. అందుకే పవన్‌ కళ్యాణ్‌ ఎటువంటి దాడులనైనా తట్టుకోగల వారాహిని ప్రత్యేకంగా తయారుచేయించుకోవలసి వచ్చింది!

ADVERTISEMENT

ఏపీ సిఎం జగన్‌ బటన్ నొక్కుడు సభలకు వీలైనంత వరకు హెలికాఫ్టర్‌లోనే వెళుతుంటారు. ఒకవేళ ఏ ప్రాంతంలోనైనా రోడ్డు మార్గంలో పర్యటిస్తున్నట్లయితే ఆ ప్రాంతంలో దారిపొడవునా పరదాలు కట్టించుకొంటారు. పోలీసులు దుకాణాలు మూయించివేస్తారు. ఆ ప్రాంతంలో ప్రతిపక్ష నేతలు, కార్యకర్తలను గృహనిర్బందం చేస్తుంటారు. అంతేకాదు… ఆ ప్రాంతంలో పచ్చటి చెట్లు ఎంతపెద్దవైనా నిర్ధాక్షిణ్యంగా నరికేస్తుంటారు.

ఈరోజు సిఎం పర్యటన సందర్భంగా దారిపొడవునా పచ్చగా పెరిగిన అనేక చెట్లను, మంచి ఫలసాయం అందించే కొబ్బరి చెట్లను కూడా నిర్ధాక్షిణ్యంగా నరికేశారు. ఆ తర్వాత వెంకటాయపాలెంలో ఆయనే మొక్కలు నాటడం విచిత్రంగా ఉంది కదా? ఓ చేత్తో మొక్కలు నాటుతో మరో చేత్తో నరికించేస్తుంటే ఇక మొక్కలు నాటడం ఎందుకు?

గోదావరి జిల్లాలో ప్రజలు కొబ్బరి చెట్లను తమ ఇంట్లో పెద్ద కొడుకుగా భావిస్తుంటారని అటువంటి చెట్లను నిర్ధాక్షిణ్యంగా నరికేశారని పవన్‌ కళ్యాణ్‌ ఆవేదన వ్యక్తం చేశారు. జగన్‌ పాలనలో చెట్లకు కూడా కష్టాలు, గొడ్డలి వేటులు తప్పడం లేదని పవన్‌ కళ్యాణ్‌ అన్నారు. అసలు జగన్‌ ఎవరిని చూసి అంతగా భయపడుతున్నారు?ఎందుకు చెట్లు నరికించేస్తున్నారని పవన్‌ కళ్యాణ్‌ ప్రశ్నించారు.

ఇప్పుడు మళ్ళీ తెలంగాణ సిఎం కేసీఆర్‌ విషయానికి వస్తే, ఆయన రాజధాని హైదరాబాద్‌ నగరంలో కూడా లక్షాలాది చెట్లు నాటించి పచ్చదనం పెంచారు. అర్బన్ పార్కులు, ఆక్సిజన్ పార్కులు అంటూ రకరకాల పేర్లతో పచ్చటిచెట్లతో హైదరాబాద్‌ని నింపేస్తున్నారు. హరితహారం పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా కోట్లాది చెట్లు నాటించి, పెంచుతూ తెలంగాణ అంతటా పచ్చదనం పెంచారు.

ఆయన కూడా తరచూ జిల్లా పర్యటనలు చేస్తూనే ఉంటారు. సభలు నిర్వహిస్తూనే ఉంటారు. కానీ ఏనాడూ ఆయన పర్యటనలో ఒక్క చెట్టు నరికించిన దాఖలాలు లేవు. మరి ఆయనకు లేని ప్రమాదం, శత్రువులు ఒక్క జగన్‌కే ఉన్నారా?

మరి కొన్ని నెలలలో ఏపీలో ఎన్నికలు జరుగబోతున్నాయి. అప్పుడు సిఎం జగన్‌ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించాల్సి ఉంటుంది. అంటే ఎన్నికలయ్యే లోపుగా రాష్ట్రంలో చెట్లన్నీ నరికించేస్తారా? అని ప్రజలు, పర్యావరణ ప్రేమికులు ప్రశ్నిస్తున్నారు.

ADVERTISEMENT
Latest Stories