జగన్ చిన్నాన్న, మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డికు ఈ సారి ఒంగోలు ఎంపీ టిక్కెట్ లభించలేదు. ఆయనను కాదని టీడీపీ నుండి తెచ్చిన మాగుంట శ్రీనివాసుల రెడ్డికి టికెట్ ఇచ్చారు జగన్. ఈ చర్యతో వైవీ మనస్తాపం చెంది ఎన్నికల సమయంలో ఎవరికీ అందుబాటులో లేరు. నియోజకవర్గంలో జగన్ నిర్వహించిన బహిరంగ సభకు సుబ్బారెడ్డి రాకపోవడం అప్పట్లో చర్చనీయాంశమైంది. అయితే ఎటువంటి నిర్ణయం తీసుకోకుండా పార్టీలోనే ఉండి పోయారు ఆయన. అధికారంలోకి రావడంతో మళ్ళీ మునిపటిలా క్రియాశీలకంగా మారిపోయారు.
ఇప్పుడు ఆయనను టీటీడీ చైర్మన్ గా చెయ్యాలని జగన్ భావిస్తున్నారట. మరోవైపు టిటిడి బోర్డు చైర్మన్ పదవికి రాజీనామా చేయడానికి టిడిపి నేత పుట్టా సుధాకర్ యాదవ్ తిరస్కరిస్తుండడంతో టిటిడి బోర్డును రద్దు చేసే దిశగా వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం నుండి ప్రయత్నాలు జరుగుతున్నాయి.ఇందుకు సంబందించి దేవాదాయ శాఖ ప్రతిపాదనలు తయారు చేస్తోందని సమాచారం వస్తుంది. టిటిడితో పాటు రాష్ట్రంలోని ఇతర ఆలయాల ధర్మకర్తల మండళ్ల రద్దుకు త్వరలోనే ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉంది.
టిటిడి సభ్యులు పొట్లూరి రమేష్బాబు, కె.రాఘవేంద్రరావు, చల్లా రామచంద్రారెడ్డి, రుద్రరాజు పద్మరాజు స్వచ్ఛందంగా రాజీనామా చేశారు. సెంటిమెంటు దృష్ట్యా ఆలయాల మండళ్ల నుంచి తప్పుకోడానికి కొందరు ఇష్టపడడం లేదు. అధ్యక్షుడు పుట్టా సుధాకర్ యాదవ్తో సహా ఇతర సభ్యులు తప్పుకోవడానికి సుముఖంగా లేరు. దీనితో ప్రభుత్వమే వారిని తప్పించే దిశగా అడుగులు వేస్తుంది. వీలైనంత తొందరగా అనుయాయులతో వీటిని భర్తీ చెయ్యడానికి జగన్ సిద్ధం అవుతున్నారు.



