నంద్యాల ఉప ఎన్నికలలో అధికార తెలుగుదేశం పార్టీ 27496 ఓట్ల తేడాతో ఘనవిజయం సాధించి, ప్రతిపక్ష పార్టీని కోలుకొనివ్వకుండా చేసింది. టిడిపికి 97106 ఓట్లు రాగా, వైఎస్సార్సీపీకి 69,610 ఓట్లు రావడంతో ప్రతిపక్ష హోదా నిలబెట్టుకుంది. ఇక జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ కు కేవలం 1357 ఓట్లు మాత్రమే దక్కించుకుని మరోసారి భారీ భంగపాటుకు గురైంది. గత ఎన్నికలలో దాదాపుగా 2700 ఓట్లు దక్కించుకున్న కాంగ్రెస్, ఈ సారి అంతకంటే తక్కువగా దక్కించుకోవడం, ఇక ఆ పార్టీ ఏపీలో భూస్థాపితం అయినట్లే భావించవచ్చు.
నిజానికి నంద్యాలలో గెలిచేది టిడిపి గానీ, వైసీపీ గానీ అన్న విషయం అందరికీ తెలిసిందే. కాంగ్రెస్ అనేది ‘అవుట్ ఆఫ్ సిలబస్’ కాగా, ఈ ఫలితాలు వెల్లడవుతున్న సమయంలో… కాంగ్రెస్ నేత తులసిరెడ్డి ఓ అద్భుతమైన జోక్ వేసారు. ఆయనకు జోక్ లాగా అనిపించనప్పటికీ అది విన్న వారికి గానీ, చూసిన వారు గానీ నవ్వుకోకుండా ఉండలేరు. “ఈ ఎన్నికలలో డబ్బులు ఏరులై పారిందని, ప్రధాన పార్టీలు రెండు టిడిపి, వైసీపీ డబ్బులను బాగా పంచిపెట్టాయని చెప్పిన తులసిరెడ్డి, అలా జరిగి ఉండకపోతే కాంగ్రెస్ గెలిచేదని చెప్పి” అందరినీ నవ్వించారు.
ఇలా వీక్షకులను నవ్వించడంలో తాము, తమ పార్టీ నవ్వుల పాలయ్యమన్న సంగతిని బహుశా తులసిరెడ్డి గారు మరిచినట్లున్నారు. నంద్యాల ఎన్నికలలో మొత్తం పోలైన 1.70 లక్షల చిలుకు ఓట్లలో 1% ఓట్లన్నా కూడా 1700 రావాల్సి ఉంటుంది. అది కూడా సాధించలేని కాంగ్రెస్ పార్టీ, ఏకంగా విజయం సాధిచేస్తుందని చెప్పడం తులసిరెడ్డి గారు బహుశా వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణం నుండి బయట పడలేదేమో అని చెప్పాలి. ఇలాంటి నాయకులు ఉన్నారు కాబట్టే కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అంత అధ్వానంగా మారింది.


