నోట్ల మార్పిడి కోసం బ్యాంకుల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నా ఫలితం మాత్రం ఉండడం లేదు. కానీ విజయవాడలో మాత్రం కావాలనుకుంటే కొత్త నోట్లు నేరుగా ఇంటికే డెలివరీ అవుతున్నాయి. కోటి రూపాయల నుంచి వంద కోట్ల వరకు ఎంతైనా కూర్చున్న చోటు నుంచే మార్చుకునే వెసులుబాటును ఓ ముఠా కల్పిస్తోంది. కాకపోతే 30 శాతం కమీషన్గా ఇచ్చుకోవాలి అంతే!
ఒక్క నోటు దొరక్క ప్రజలు అల్లాడిపోతుంటే ఏకంగా కట్టలకు కట్టలు అవలీలగా మార్చేస్తామంటున్న ముఠా ఓ మీడియా ఛానల్ కు అడ్డంగా దొరికిపోయింది. బెజవాడలో అడ్డగోలుగా సాగుతున్న ఈ ముఠా బాగోతం బట్టబయలైంది. “మీ దగ్గర ఎన్ని కోట్ల నల్ల డబ్బు ఉన్నా దానిని చిటికెలో మార్చేస్తామంటూ ఓ మహిళ నేరుగా ఫోన్లు చేస్తూ దందా సాగిస్తుండడం” సంచలనం రేపింది.
మీడియా ప్రతినిధులకు ఫోన్ చేసిన ఆమె ముందుగా చెప్పిన స్థలానికి మరో వ్యక్తితో కలిసి వచ్చింది. అతడిని తన సోదరుడిగా పరిచయం చేసుకుంది. నల్ల డబ్బును తామెలా మార్చేది వివరించింది. నగరంలో ప్రముఖ ఆస్పత్రికి చెందిన నోట్లను కూడా తామే మార్చామని, తమ ముఠాలో 30 మంది వరకు పోలీసులు కూడా ఉన్నారని వివరించింది. తమ వద్ద ఉన్నవి అసలైన కొత్త నోట్లేనని పేర్కొంటూ బయటకు తీసి చూపించింది.
అలాగే ఎంత డబ్బుఅయినా చిటెకెలో మార్చేస్తామంటూ హామీ ఇచ్చింది. మొత్తం ఇంటి వద్దకే డోర్ డెలివరీ చేస్తామని తెలిపింది. ముఠా వ్యవహారం బయటకు వచ్చిన వెంటనే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విచారణకు ఆదేశించారు. కాగా కమీషన్ల పేరుతో భారీ దందాకు తెరలేపిన ముఠాలో మొత్తం పది మంది సభ్యులు ఉన్నట్టు మహిళ చెప్పిన సమాచారాన్ని బట్టి తెలుస్తోంది.



