మొదటి మూడు సినిమాలు సిల్వర్ జూబ్లీలు ఆడడంతో, ఒక్కసారిగా టాక్ ఆఫ్ టాలీవుడ్ మాత్రమే కాదు, ఏకంగా మెగాస్టార్ ఇంటికి అల్లుడు కాబోతున్నాడు అన్న వార్త ఉదయ్ కిరణ్ ను ఉక్కిరిబిక్కిరి చేసి ఉండవచ్చు. అయితే సుస్మితకు – ఉదయ్ కిరణ్ కు నిశ్చితార్ధం జరిగిన తర్వాత అసలేం జరిగింది? వారు ఎందుకు విడిపోయారు? ఉదయ్ కిరణ్ ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడు? బయట ప్రచారంలో ఉన్నట్లుగా దీని వెనుక మెగా ఫ్యామిలీ కుటుంబ సభ్యులు… అంటే ప్రధానంగా మెగాస్టార్ చిరంజీవే ఉన్నారా?
మెగా కాంపౌండ్ నుండి ఈ ప్రశ్నలకు సమాధానాలు లభించవు గానీ, ఉదయ్ కిరణ్ సోదరి శ్రీదేవి ఈ ప్రశ్నకు తాజాగా బదులిచ్చారు. ఉదయ్ కు చిన్నతనం నుంచి చిరంజీవి అంటే చాలా ఇష్టమని, అయితే నిశ్చితార్ధం జరిగిన తర్వాత ఒకరినొకరు అర్ధం చేసుకునే క్రమంలో బేధాభిప్రాయాలు తలెత్తాయని, దీంతో ఆలోచనలు కలవడం లేదని విడిపోవాలని తొలుత ఉదయ్ కిరణే నిర్ణయం తీసుకున్నారని, దీనికి చిరంజీవితో సహా మరెవరూ కారణం కాదని చెప్పుకొచ్చారు శ్రీదేవి.
నిజానికి ఉదయ్ కిరణ్ తో కలిసి ఓ సారి చిరంజీవి ఇంటికి వెళ్లానని, ఆయన మమ్మల్ని రిసీవ్ చేసుకున్న విధానం అద్భుతమని, ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత ఉదయ్ కు చిరంజీవి చాలా సహకారం అందించారని, నిశ్చితార్ధం కూడా చాలా గ్రాండ్ గా చేసారని, ఈ పెళ్లి రద్దు కావడం వెనుక చిరంజీవి లేరంటూ స్పష్టత ఇచ్చే ప్రయత్నం చేసారు. ఇప్పటివరకు ఈ ఉదంతంపై ఇరువర్గాల నుండి ఎవరూ స్పందించకపోవడంతో, శ్రీదేవి చేసిన వ్యాఖ్యలు అత్యంత ప్రాధాన్యత దక్కించుకున్నాయి.



