రాజకీయ విశ్లేషకుడిగా భావించే ఉండవల్లి అరుణ కుమార్ జగన్ పక్షపాతి అని తెలిసినప్పటికీ అందరివాడిని అని నిరూపించుకోవడానికి ఎప్పటికప్పుడు ప్రయత్నిస్తుంటారు. జగన్ రాజకీయంగా డిఫెన్సులో పడ్డప్పుడల్లా మీడియా ముందుకు వచ్చి అటు బ్లూ మీడియాకు, ఇటు యెల్లో మీడియాకు కొన్ని వార్తలు ఇచ్చి పోతుంటారు.
స్థానిక ఇంచార్జ్ ల మార్పులు, నాయకుల రాజీనామాలతో కాస్త కంగారుపడుతున్న వైసీపీ ప్రభుత్వానికి, జగన్ కు కొన్ని ఉచిత సలహాలు ఇచ్చారు ఉండవల్లి. ఇంచార్జ్ ల మార్పు అంటూ జగన్ తీసుకున్న నిర్ణయం చాల చాకచక్యంతో చేయాల్సిన పని అని అంత నైపుణ్యం జగన్ కు లేదని చెప్పారు. అటు వంటి నిర్ణయంతో ఎవరిని నొప్పించక అందరిని ఒప్పించి ముందుకెళ్లాలి.
లేకుంటే జగన్ తీసుకుంటున్న నిర్ణయాలు ఆ పార్టీకి, జగన్ ప్రభుత్వానికి భవిష్యత్ లో చాల ఇబ్బందులను సృష్టిస్తుందని తెలియచేసారు. తెలంగాణలో సిట్టింగ్ ఎమ్మెల్యే లను మార్చకపోయావడం వలన కేసీఆర్ ఓడిపోయాడని జగన్ సిట్టింగ్ ఎమ్మెల్యే స్థానాలను మార్పు చేస్తున్నారు. ఇప్పుడు జగన్ చేసే మార్పుల వలన ఏపీలో జగన్ అధికారం కోల్పోకూడదు కదా..?అంటూ జగన్ కు ఒక సలహా ఇచ్చి పడేసారు ఉండవల్లి.
అలాగే వైసీపీ ప్రభుత్వంలో ఎమ్మెల్యే లకు, మంత్రులకు అసలు ఏం అధికారం ఉంది అంటూ ప్రశ్నించారు.అధికారం మొత్తం అయితే జగన్ దగ్గర లేకుంటే వాలంటీర్ల దగ్గరే కేంద్రీకృతమయ్యింది అనే వాస్తవాన్ని బయటపెట్టేసారు. ఇదే అభిప్రాయాన్ని గతంలో వైసీపీ ఎమ్మెల్యే లు కూడా వ్యక్తపరిచారు. ఇప్పుడు వైసీపీ లో ఉన్న పలువురు మంత్రుల కన్నా వార్డు వాలంటీర్లకే ఎక్కువ స్వేచ్ఛ, అధికారం ఉందనేది కాదనలేని సత్యం.
అసలు జగన్ తన పార్టీ టిక్కెట్లన్నీ వాలంటీర్లకు ఇచ్చేస్తే అది వేరే విషయం కానీ ఇలా స్థానిక నాయకులను స్థాన చలనం చేస్తూ తీసుకుంటున్న నిర్ణయాలు ఏమేరకు ఫలితాలనిస్తుందో చెప్పడం కష్టమే అని తేల్చేశారు. అటు ప్రతిపక్ష పార్టీలైన టీడీపీ – జనసేనలు ఒకేతాటి మీదకు రావడం కూడా ఆ పార్టీలకు బలంగా వైసీపీ పార్టీకి బలహీనంగా మారుతుందని ఉండవల్లి గారు విశ్లేషించారు.
టీడీపీ – జనసేన కూటమికి ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ తోడైతే తెలంగాణలో తన మిత్రపక్షానికి దక్కిన ప్రతిపక్ష స్థానం ఏపీలో తన పార్టీకి దక్కవచ్చనే కంగారు జగన్ నిర్ణయాలలో కొట్టొచ్చినట్లు కనపడుతుంది అంటున్నారు ప్రతిపక్ష నేతలు.




