విశాఖపట్నంలో నగరం నడిబొడ్డున ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద రూ.40 లక్షలు ఖర్చు చేసి కొత్తగా నిర్మించిన బస్-బే ప్రారంభోత్సవానికి ముందే ఆదివారం ఉదయం కూలిపోయింది. అదృష్టవశాత్తు ఈ ప్రమాదంలో ఎవరూ గాయపడలేదు.
బస్-బే పైన నవరత్నాల లోగో మద్యలో జగన్ ఫోటో కూడా ఏర్పాటు చేశారు. ప్రయాణికులు వేచి చూసే ఓ చిన్న బస్టాప్ నిర్మించడం గొప్ప విషయమేమీ కాదు. కానీ అదేదో గొప్ప కట్టడం అన్నట్లు దానికీ సిఎం జగన్ ఫోటో పెట్టుకొని ఆ క్రెడిట్ పొందాలనుకొంది కనుక అది కూలిపోవడానికి బాధ్యత కూడా వైసీపీ ప్రభుత్వానిదే అవుతుంది.
ఓ చిన్న బస్టాండ్ సవ్యంగా నిర్మించలేకపోయిన వైసీపీ ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టుని ఏమి నిర్మించగలదు?విశాఖ రాజధానిని ఏవిదంగా అభివృద్ధి చేయగలదు?అయినా కూల్చివేయడం, టిడిపి హయాంలో కట్టినవాటికి పేర్లు మార్చి వైసీపీ రంగులు వేసుకోవడమే తప్ప వైసీపీ ప్రభుత్వం ఈ నాలుగేళ్ళలో చెప్పుకోదగ్గ ఒక్క పెద్ద కట్టడం కట్టిందా?అని సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
విశాఖ రాజధాని అంటూ పచ్చటి ఋషికొండను తవ్వేసి పెద్ద మట్టిదిబ్బగా మార్చేసి దానిపై అనుమతులు లేకుండా భవనాలు నిర్మించారు తప్పితే విశాఖ నగరంలో కొత్తగా ఒక్క రోడ్డు నిర్మించారా?కొత్తగా ఒక్క ఫ్లైఓవర్ నిర్మించారా?అని విశాఖ ప్రజల ప్రశ్నలకు వైసీపీ నేతల వద్ద సమాధానం ఉండదు.
సిఎం జగన్ విశాఖకు మకాం మార్చడమే ఉత్తరాంద్ర జిల్లాల ప్రజలకు పెద్ద వరం అన్నట్లు వైసీపీ నేతలు మాట్లాడుతుంటారు. అయితే నగరంలో ఇప్పుడున్న జనాభా, వాహనాలకే ఇరుకు రోడ్లు సరిపోక నిత్యం ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్లో చిక్కుకొని విశాఖ ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు.
ఒకవేళ ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు, సుమారు 40 వేలకు పైగా సచివాలయ సిబ్బంది వారి కుటుంబాలు, వాహనాలతో సహా విశాఖకు తరలివస్తే నగరంలో వారందరికీ కార్యాలయాలు, వసతి, రోడ్లు, ట్రాఫిక్ పరిస్థితి ఏమిటి?అని వైసీపీ ప్రభుత్వం కానీ జీవీఎంసీకానీ ఆలోచించిన్నట్లు లేదు.
అందుకే రోడ్లు, ఫ్లైఓవర్ల నిర్మాణం గురించి ఆలోచనలు చేయడం లేదు. కానీ ఎన్నికలు సమీపిస్తునందున విశాఖ నగరాన్ని రాజధానిగా అభివృద్ధి చేసేస్తున్నామని ప్రజలను మభ్యపెట్టడానికే హడావుడిగా ఈ బస్-బే వంటి చిన్న చిన్న పనులు చేస్తున్నారు. కానీ అవీ సక్రమంగా చేయలేకపోతున్నారని నిన్న కూలిపోయిన బస్-బేయే ప్రత్యక్ష సాక్ష్యంగా కనిపిస్తోంది.



