టీడీపీ ఉద్యోగి సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో మూడు నెలలుగా జైల్లో ఉంటున్న గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని పోలీసులు కోర్టుకు తీసుకువచ్చినప్పుడు, ఆయనని చూసి అందరూ ఆశ్చర్యపోయారు. ఆయన రూపురేఖలు ఎవరూ గుర్తు పట్టలేనంతగా మారిపోయాయి. ఆయనని ఆ పరిస్థితిలో చూసినప్పుడు జగన్ చెప్పిన అందగాడు ఈయనేనా?అని అనుమానం కలుగుతుంది.
వల్లభనేని వంశీ కంటే చంద్రబాబు నాయుడు వయసులో చాలా పెద్ద. అయనని జగన్ ప్రభుత్వం అరెస్ట్ చేసి దాదాపు రెండు నెలలు జైల్లో పెట్టినప్పటికీ ఎంతో నిబ్బరంగా ఆ బాధలన్నీ అనుభవించారు. బయటకు వచ్చినప్పుడు ఆయన కొద్దిగా చిక్కినట్లు కనబడ్డారు తప్ప ఆయన రూపురేఖలలో పెద్దగా మార్పు కనబడలేదు. చంద్రబాబు నాయుడు-వైసీపీ నేతలకి ఈ విషయంలో కూడా ఇంత తేడా ఉండటం విశేషమే కదా?
వల్లభనేని వంశీ రూపు రేఖలు మారిపోవడమే కాదు.. తరచూ జైల్లో అనారోగ్యానికి కూడా గురవుతున్నారు. సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో బెయిల్ లభిస్తే బయటపడవచ్చని అనుకుంటే, నకిలీ ఇళ్ళ పట్టాల కేసులో మళ్ళీ అరెస్ట్ అయ్యారు. కనుక వల్లభనేని వంశీకి మరికొంత కాలం జైలు జీవితం తప్పకపోవచ్చు.
ఇటువంటి సమయంలో వంశీ ప్రాణ మిత్రుడు, గుడివాడ మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని తోడుగా ఉండి ఉంటే చాలా ధైర్యంగా ఉండేది. కానీ ఆయనపై కేసులు నమోదైన తర్వాత ముంబైకి వెళ్ళి గుండెకు బైపాస్ ఆపరేషన్ చేయించుకున్నారు. ఆ తర్వాత నెలరోజులు విశ్రాంతి అవసరమని వైద్యులు చెప్పారు. ఆ నెల రోజులు ఇంటర్వెల్ ఎప్పుడో పూర్తయింది. కానీ కొడాలి నాని ఇంకా గుడివాడకు తిరిగి రాలేదు!
కొడాలి నాని కూడా అందగాడే కనుక గుడివాడ వస్తే కేసు, విచారణ అంటూ పోలీసులు కధ మొదలు పెట్టి అరెస్ట్ చేయక మానరు. బహుశః అందుకే ఆయన విశ్రాంతిని పొడిగించుకొని ఇంకా ముంబయిలోనే ఉంటున్నారు. కనుక ఆయన కోసం పోలీసులు, జైల్లో ప్రాణ మిత్రుడు వల్లభనేని వంశీ ఎదురుచూస్తూనే ఉన్నారు.
మరి కొడాలి నాని గుడివాడ ఎప్పుడు తిరిగి వస్తారో? అసలు వస్తారో రారో? లేదా మెరుగైన చికిత్స, మెరుగైన విశ్రాంతి కోసం అమెరికాకు బయలుదేరుతారో?




