శుక్రవారం విజయవాడలో ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలకు ముఖ్య అతిధిగా హాజరైన కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్, చంద్రబాబు నాయుడు దూరదృష్టి ఉన్న మంచి నాయకుడని ప్రశంశిస్తే, వైసీపీ నేతలకు కడుపులో అసిడిటీ వచ్చేసింది.
మాజీమంత్రి కొడాలి నాని రజనీకాంత్ని ఉద్దేశ్యించి ‘చీకేసిన తాటికాయలాంటి మొహం వేసుకొని వచ్చి… వెదవలందరూ కలిసి…’ అంటూ నోటికి వచ్చిన్నట్లు మాట్లాడి తన కడుపు మంట చల్లార్చుకోగా, తన శాఖ గురించి తప్ప ఇటువంటి విషయాల గురించి మాత్రమే మాట్లాడే పర్యాటకమంత్రి ఆర్కె.రోజా కూడా రజనీకాంత్ అవగాహన లేకుండా మాట్లాడారని విమర్శించారు. వైసీపీలో ఇంకామరో ఇద్దరు మంత్రులు అంబటి రాంబాబు, గుడివాడ అమర్నాథ్ మిగిలిపోయారు. వారూ నేడో రేపో ఏదో ఒకటి మాట్లాడకుండా ఉండరు.
వైసీపీ మంత్రులకు టిడిపి నేతలు కూడా అంతే ఘాటుగా జవాబులిచ్చారు. టిడిపి పొలిట్ బ్యూరో సభ్యురాలు వంగలపూడి అనిత మాట్లాడుతూ, “నిన్న రజనీకాంత్గారు చంద్రబాబు నాయుడుగారిని ప్రశంశిస్తూ మాట్లాడుతున్నప్పుడే వైసీపీ నేతలకు కడుపు మంట మొదలైపోతుందని అనుకొన్నాను. కానీ ఇవాళ్ళ ఇంకా ఎవరూ మాట్లాడలేదేమిటా… అనుకొంటుంటే మాట్లాడారు. అంత పెద్దాయనను పట్టుకొని ఏనుగు వెళుతుంటే ఊరకుక్కలు మొరిగిన్నట్లు మొరిగారు. ఇంతకీ ఆయనేమన్నా మీ అధినేతను, మీ ప్రభుత్వాన్ని విమర్శించారా?లేదే… చంద్రబాబు నాయుడుకి దూరదృష్టి గలవారని పొగిడారు. చంద్రబాబు నాయుడు హైదరాబాద్ని అభివృద్ధి చేయబట్టే నేడు లక్షలాదిమంది తెలుగువారు విదేశాలలో హాయిగా ఉద్యోగాలు చేసుకోగలుగుతున్నారని అన్నారు. అది వాస్తవమే కదా?మీ అధినేతకు ఆ విజన్ లేదు కనుకనే ఎవరైనా చంద్రబాబు నాయుడుని పొగిడితే వారి మీద కూడా పడి ఏడుస్తుంటారు. ఈ ఏడ్పులు నిజంగా మీవేనా లేక మీ అధినేత కోసం ఏడుస్తున్నారా?అయినా బాబాయ్ని గొడ్డలివేటుతో పైకి పంపించేసినవారు కూడా వెన్నుపోటు గురించి మాట్లాడుతుండటం చాలా ఆశ్చర్యం ఉంది,” అని అన్నారు.
టిడిపి పొలిట్ బ్యూరో సభ్యుడు, సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాట్లాడుతూ, “ఒకప్పుడు మీరందరూ కూడా ఎన్టీఆర్, చంద్రబాబు నాయుడు కాళ్ళుపట్టుకొని బ్రతికినవారే కదా?రజనీకాంత్ ఎన్టీఆర్, చంద్రబాబు నాయుడుల గురించి మాట్లాడితే మద్యలో మీకెందుకు మంటట? దక్షిణాదిలో రాష్ట్రాలలో ఎంతో గౌరవం, ప్రతిష్ట కలిగిన వ్యక్తి రజనీకాంత్గారు. ఆలాంటి పెద్ద మనిషి మన రాష్ట్రానికి వచ్చి మనవాళ్ళ గొప్పదనాన్ని మెచ్చుకొంటూ మాట్లాడినా మీ వైసీపీ నేతలు సహించలేరా? ఇదేం ఖర్మరా నాయినా?” అని ఎద్దేవా చేశారు.



