ఈ మధ్యనే వైఎస్సాఆర్ కాంగ్రెస్ నుండి బయటకు వచ్చిన వంగవీటి రాధ తన రాజకీయ భవితవ్యం గురించి ఇంకా ఏమీ తేల్చలేదు. టీడీపీలో చేరతారని మొదట వినిపించినా అడుగు ముందుకు పడలేదు. ఈరోజు సాయంత్రం ఎన్నికల షెడ్యూల్ వస్తాది అనగా ఈరోజు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతో సమావేశమై… పార్టీలో చేరడానికి సంబంధించిన తేదీని ఖరారు చేస్తారనే ప్రచారం సాగుతోంది. ఇక బెజవాడలో ఇళ్ల పట్టాల సమస్య పరిష్కారానికి ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు కూడా జారీచేసే అవకాశం ఉందంటున్నారు.
ఈ నెలాఖరులోగా వంగవీటి రాధాకృష్ణ.. సైకిల్ ఎక్కుతారని చెబుతున్నారు ఆయన అనుచరులు. వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీలో చాలా అవమానాలు ఎదుర్కొన్నానని, ఈ అవమానాలు వేరెవరికీ జరగకూడదని బయటకు వచ్చా అని వంగవీటి ఇప్పటికే చెప్పారు. “పార్టీలో చేరేటప్పుడు.. తమ్ముడిలా చూసుకుంటానని చెప్పి జగన్ మోసం చేశారు. నీ తండ్రి మీద జాలిచూపించి పార్టీలో ఉండనిచ్చా అని పదేపదే అనేవాడు. నేను వదిలిస్తే గాలికి పోతావని అని కూడా అనేవాడు” అని వంగవీటి చెప్పారు.
ఇదే సమయంలో తెలుగుదేశం పార్టీకి మద్దతుగా ఆయన కొన్ని కీలక వ్యాఖ్యలు చేసారు. రంగా హత్య కొందరు వ్యక్తుల పని అని, దానిని టీడీపీకి ఆపాదించడం సరికాదన్నారు. రంగాను అభిమానించేవాళ్లు అన్ని పార్టీల్లో ఉన్నారని వంగవీటి పేర్కొన్నారు. వైఎస్సాఆర్ కాంగ్రెస్ లో విజయవాడ సెంట్రల్ సీటును ఆశించారు రాధా. అయితే దానిని మల్లాది విష్ణుకు కేటాయించారు జగన్. ఆ తరువాత నుండి పొమ్మనలేక పొగ బెట్టి చివరకు ఆయన బయటకు పంపించేశారని రంగా అభిమానుల అభిప్రాయం.



