ఇదివరకు జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, ఆయన పట్ల విధేయత నిరూపించుకోవడానికి గాను చంద్రబాబు నాయుడుని, పవన్ కళ్యాణ్ అవహేళన చేస్తూ మాట్లాడటం తప్పనిసరిగా ఉండేది. అలా విధేయతా పరీక్షలో ఉత్తీర్ణులైన వారినే జగన్ నమ్మేవారని లేకుంటే దూరం పెట్టేవారని వైసీపీని వీడి వచ్చిన నేతలే చెపుతుంటారు. ఇప్పుడు టీడీపీ కూడా అదే ఫార్ములా ఫాలో అవుతోందా?అనే అనుమానం కలుగుతోంది.
ఇదివరకు మహిళా కమీషన్ చైర్ పర్సన్గా వ్యవహరించిన వాసిరెడ్డి పద్మ వైసీపీకి రాజీనామా చేసి జగన్ని విమర్శిస్తున్నారు. ఆమె శనివారం విజయవాడలో టీడీపీ ఎంపీ కేశినేని చిన్నీతో భేటీ అయ్యారు. ఆయన ద్వారా సిఎం చంద్రబాబు నాయుడుని ఒప్పించి టీడీపీలో చేరేందుకు సిద్దమవుతున్నారు.
చంద్రబాబు నాయుడు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతోనే కేశినేని చిన్ని ఆమెతో భేటీ అయ్యారని సమాచారం. కనుక నేడో రేపో ఆమె సిఎం చంద్రబాబు నాయుడుని కలిసి టీడీపీ కండువా కప్పుకోవడం కూడా ఖాయంగానే కనిపిస్తోంది.
గతంలో ఆమె మహిళా కమీషన్ చైర్ పర్సన్గా వ్యవహరించినప్పుడు ఆమె కూడా చంద్రబాబు నాయుడు పట్ల అనుచితంగా మాట్లాడారు. జగన్ మెప్పు కోసం చంద్రబాబు నాయుడుకి, పవన్ కళ్యాణ్ ఇద్దరికీ నోటీసులు కూడా ఇచ్చారు.
ఇప్పుడు వైసీపీ ఓడిపోగానే టీడీపీలో చేరిపోయేందుకుగాను జగన్, విజయసాయి రెడ్డిలపై విమర్శలు చేశారు. కనుక ఆమె టీడీపీలో చేరడానికి ప్రాధమిక అర్హత సాధించారని అనుకోవాలా? టీడీపీలో చేరాలంటే అదే ప్రాధమిక అర్హతా? అనే సందేహం కలుగుతోంది.
ఇదివరకు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్లను విమర్శించిన వాసిరెడ్డి పద్మ, ఇప్పుడు వైసీపీని వీడి జగన్ని విమర్శిస్తున్నప్పుడు, రేపు మళ్ళీ వైసీపీ అధికారంలోకి వస్తే టీడీపీని వీడకుండా అంటిపెట్టుకొని ఉంటారా? వైసీపీలో చేరేందుకు చంద్రబాబు నాయుడుని విమర్శించకుండా ఉంటారా?
అయినా ఇంతకాలం టీడీపీ నేతలు ఎవరి నోటికి బలయ్యారో, ఎవరితో టీడీపీ నేతలు, కార్యకర్తలు రాజకీయ పోరాటాలు చేశారో అటువంటి వారిని పార్టీలో చేర్చుకోవడం ద్వారా ఎటువంటి సందేశం పంపుతున్నట్లు? వైసీపీలో ఉన్నవారు అవినీతిపరులని నిందిస్తున్నప్పుడు, టీడీపీలో చేరగానే కడిగిన ఆణి ముత్యాలైపోతారా?
కష్టకాలంలో కూడా టీడీపీని అంటిపెట్టుకొని ఉన్న నేతలకే, ఇంతవరకు పదవులు లభించక ఎదురుచూపులు చూస్తున్నప్పుడు టీడీపీని రాజకీయంగా దెబ్బతీసి తుడిచిపెట్టేయాలని ప్రయత్నించినవారిని పార్టీలోకి తెచ్చుకోవడం, వారికీ పదవులు పంచిపెట్టడం అవసరమా?
అయినా ఇప్పటికే టీడీపీ ‘హౌస్ ఫుల్’ అయినప్పుడు వైసీపీ నుంచి విశ్వసనీయత లేని నేతలని తెచ్చుకోవడం అవసరమా? అని పార్టీ శ్రేయోభిలాషుల ప్రశ్నిస్తున్నారు.




