ప్రస్తుతం టాలీవుడ్ లో ఫుల్ స్వింగ్ లో ఉన్న కమెడియన్ ఎవరు అన్నా… సిల్వర్ స్క్రీన్ పై చిరు దరహాసం పండిస్తున్న నటుడు అన్నా… గుర్తుకు వచ్చే ఏకైక పేరు ‘వెన్నెల’ కిషోర్ గా మారిపోయింది. ‘రారండోయ్ వేడుక చూద్దాం, కేశవ, అమీ తుమీ… ఇలా వరుస హిట్లతో దూసుకుపోతున్న వెన్నెల కిషోర్ లో మరో కోణం కూడా ఉందన్న విషయం అందరికీ తెలిసినది కాదు.
కమెడియన్ గా కిషోర్ ఎంత సక్సెస్ ఫుల్ అయ్యారో… దర్శకుడిగా అంతే విఫలం అయ్యారన్న సంగతి చాలా మందికి తెలియదు. ఎందుకంటే… అసలు ఆ సినిమాలు వచ్చి వెళ్లాయని కూడా సినీ అభిమానులకు పరిజ్ఞానం లేదు కాబట్టి! వెన్నెల కిషోర్ దర్శకత్వంలో “జఫ్ఫా, వెన్నెల వన్ అండ్ హాఫ్” సినిమాలు తెరకెక్కి ప్రేక్షకులను పలకరించాయి గానీ, ఆడియన్సే ఆ వైపుగా అసలు చూడలేదు.
దీంతో తాను చేతులు కాల్చుకున్న విషయం తెలుసుకున్న కిషోర్, మళ్ళీ అటు వైపుగా ప్రయత్నాలు చేయలేదు. ఆ తర్వాత కమెడియన్ గా బిజీ కావడం… తగినన్ని అవకాశాలతో వరుస సినిమాలు చేస్తున్నాడు. అయితే ఇటీవల కాలంలో విడుదల అవుతోన్న సినిమాలలో ‘వెన్నెల’ కిషోర్ కామెడీ హైలైట్ గా నిలుస్తుండడంతో ప్రేక్షకుల మదిలో చిరస్థాయిగా స్థానం సంపాదించుకుంటున్నాడు.
ఈ ఫేంతో మళ్ళీ దర్శకత్వం దిశగా అడుగులు వేస్తారా? అన్న ప్రశ్న తాజా ఇంటర్వ్యూలో వెన్నెల కిషోర్ కు ఎదురయ్యింది. దీనిపై స్పష్టత ఇచ్చిన కిషోర్… లేదండి… అలాంటి తప్పులు మళ్ళీ మళ్ళీ చేయనని, తన తప్పు తెలుసుకున్నానని స్పష్టమైన ప్రకటన చేసాడు. ఈ ప్రకటనతో సినీ అభిమానులు కూడా ఫుల్ ఖుషిగా ఉన్నారు… అంతేకదా… డైరెక్షన్ పక్కన పెడితే… కామెడీ రోల్స్ పుష్కలంగా ఉంటాయి కదా..!



