ఒకప్పుడు టాలీవుడ్ టాప్ కమెడియన్ గా వెలుగొందిన వేణుమాధవ్, ప్రస్తుతం అరకొర సినిమాలలో మాత్రమే కనిపిస్తున్నారన్న విషయం తెలిసిందే. సినిమాలలో సైలెంట్ గా ఉంటున్న ఈ నల్ల బాలు, గతంలో టిడిపి తరపున ఎన్నికల ప్రచారం చేయగా, ఉప ఎన్నికల సందర్భంగా తాజాగా నంద్యాలలో కూడా ప్రత్యక్షమయ్యారు. అయితే ఈ సారి తాను వచ్చింది ఎన్నికల ప్రచారం కోసం కాదని, భూమా బ్రహ్మానందరెడ్డి మెజార్టీ ఎంత వస్తుందో చూడడానికి వచ్చానని, తానేమీ ప్రచారం చేయడం లేదని మీడియా ముఖంగా తెలిపారు.
అయినా తెలుగుదేశం పార్టీ తరపున జగన్ మోహన్ రెడ్డి బ్రహ్మాండమైన ప్రచారం నిర్వహిస్తున్నారు, వారికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా… ఇక తామంతా ఎందుకు ప్రచారం నిర్వహిస్తామని సెటైర్లు వేసిన వేణుమాధవ్ దానికి గల కారణాలు కూడా వివరించారు. ప్రతి రోజు, ప్రతి క్షణం మాటకు ముందు చంద్రబాబు నాయుడు గారు గురించి… చంద్రబాబు నాయుడు గారు… చంద్రబాబు నాయుడు గారు… అంటూ సిఎం గారు రావాల్సిన అవసరం లేకుండానే జగన్ ప్రచారం చేస్తున్నారంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు వేణు.
ఒక విధంగా వేణుమాధవ్ చెప్పింది నిజమే. జగన్ పది నిముషాలు ప్రసంగం ఇస్తే… అందులో ఓ 50 సార్లు ‘చంద్రబాబు నాయుడు గారు’ అన్న పేరు లేకుండా మాట్లాడలేరు. ఒక రకంగా ఇది విని విని ప్రజలు కూడా విసిగిపోయారని చెప్పడంలో అతిశయోక్తి లేదు. దీనినే సినీ పరిభాషలో ప్రజలకు అర్ధమయ్యే విధంగా వేణుమాధవ్ చెప్పారని అనుకోవాలి. అందుకే ఈ వీడియో వైరల్ గా మారింది. సినీ నటుడు గనుక ‘చంద్రబాబు నాయుడు గారు’ అంటూ జగన్ పలికే వైనాన్ని వేణు బాగా క్యాచ్ చేసినట్లు కనపడుతోంది.


