వైఎస్సార్ కాంగ్రెస్ రాజ్యసభ ఎంపీ, ఆ పార్టీ కీలక నేత విజయసాయిరెడ్డి ఎప్పటిలానే తనదైన శైలిలో రెచ్చిపోయారు. పెద్దల సభ సభ్యుల కనీస హుందాతనం లేకుండా పవన్ కళ్యాణ్ మీద నీతిబాహ్యమైన విమర్శలు చేశారు. నాలుగు రాళ్లు సంపాదించుకునేందుకు వచ్చావు, నీ బతుకు, గంతులేసి వెళ్ళు, ఉల్లిపాయ మీద పొట్టు కూడా తీయలేని వాడివి అంటూ సంస్కారహీనమైన భాషలో దుర్భాషలాడారు. దీనిపై సోషల్ మీడియాలో పెద్ద దుమారమే చెలరేగుతుంది.
“నువ్వొక అమ్ముడు పోయిన వ్యక్తివి. ఉల్లిపాయ మీద పొట్టు కూడా తీయలేవు పవన్ కళ్యాణ్. అమాయకుల అభిమానాన్ని తాకట్టు పెట్టి నాలుగు రాళ్లు సంపాదించుకునేందుకు వచ్చినోడివి. ఏప్రిల్ 11 వరకు గంతులేసి వెళ్లు. నీ బతుక్కు తాటలు తీయడమొకటా? నీ యజమాని చంద్రబాబే అన్ని సర్ధుకుంటున్నాడు”, అని విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు. రోజూ ఉదయం సాయంత్రం నాలుగేసి ట్వీట్లు ఇటువంటి భాషలో వేసి పోవడం విజయసాయిరెడ్డికి నిత్యకృత్యం.
అలాగే కొన్ని జుగుప్స కలిగించే కార్టూన్లు కూడా షేర్ చేస్తూ ఉంటారు. సహజంగా మీడియా ముందే బాగా రెచ్చిపోయి మాట్లాడే విజయసాయి రెడ్డి ట్విట్టర్ లో మరింతగా దిగజారి మాట్లాడుతున్నారు అని వర్గాల వారి ఆరోపణ. ఒకపక్క అధికారం మాదే అని మేకపోతు గాంభీర్యం ప్రదర్శించినా ఇటువంటి అసహనపు ట్వీట్లు చూస్తుంటే వైకాపా ఓటమి ఖాయమని వారికి అర్ధం అయిపోయి ఉంటుందని జనసేన అభిమానుల ఆయనను ఆక్షేపిస్తున్నారు. జైలుకు వెళ్లొచ్చిన దొంగవి అంటూ గట్టిగానే బదులు చెబుతున్నారు.



