ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి గురజాడ మొదలు గంటసాల వరకు ఎందరో మహానీయులను అందించిన ఘనత విజయనగరానికే దక్కుతుంది. విజయనగరం పట్టణంలో వెలిసిన పైడితల్లి అమ్మవారిని దర్శించుకునేందుకు ఉత్తరాంద్రలోని మూడు జిల్లాల ప్రజలతో పాటు ఒడిసా నుంచి భక్తులు తరలివస్తుంటారు.
ఏటా దసరా పండుగ సమయంలో విజయనగరం పట్టణంలో అంగరంగ వైభవంగా ఉత్సవాలు జరుగుతుంటాయి. నేడు, రేపు విజయనగరం ఉత్సవాలు జరుగుతాయి. పట్టణంలో వివిధ వేదికల వద్ద, అమ్మవారి ఆలయం ఎదుట, రోడ్లపైన వివిధ జానపద కళాకారుల ప్రదర్శనలు జరుగుతాయి.
ఈ ఉత్సవాలతో పాటు విజయనగర ప్రజల ఇలవేల్పు పైడితల్లి అమ్మవారి జాతర కూడా జరుగుతుంది. రేపు (సోమవారం) తోలేళ్ళ ఉత్సవం జరుగుతుంది. మంగళవారం జరిగే ‘సిరిమాను ఉత్సవం’ చాలా ప్రత్యేకమైనది.
సుమారు 20-30 అడుగుల ఎత్తుండే ఓ చెట్టుమానుని ఓ రధానికి అమరుస్తారు. దాని చివరి ఓ చిన్న కుర్చీలో పైడితల్లి అమ్మవారి ప్రతినిధిగా భావించబడే ఆలయపూజారి కూర్చుంటారు. ఆ సిరిమాను రధాన్ని ఆలయం నుంచి రాజుగారి కోట వరకు మూడుసార్లు తిప్పుతారు.
నేడు మంత్రులు అనిత, కొండపల్లి శ్రీనివాస్, టీడీపి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ ఈ ఉత్సవాలకు జెండా ఊపి ప్రారంభించారు.
ఇప్పటికే విజయనగరం పట్టణంలో ఈ ఉత్సవాలు, అమ్మవారి జాతరతో పండగ వాతావరణం నెలకొని ఉంది. పట్టణంలో ఎక్కడ చూసినా ఏవో ఒక సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతూనే ఉన్నాయి.
పైడితల్లి అమ్మవారిని దర్శించుకునేందుకు, ఈ ఉత్సవాలను చూసేందుకు చుట్టుపక్కల జిల్లాలు, ఊర్ల నుంచి ప్రతీరోజూ లక్షలమంది ప్రజలు తరలివస్తున్నారు. అలా వచ్చిన బంధుమిత్రులతో ప్రతీ ఇళ్ళు కళకళలాడుతుంది. ప్రతీ ఇంట్లో పండగ వాతావరణం నెలకొని ఉంది.
నేడు విజయనగరం ఉత్సవాలు ప్రారంభం కావడంతో ఊరంతా చాలా కోలాహలంగా ఉంది. ఈ ఉత్సవాలను కళ్ళారా చూస్తే తప్ప ఇలా ఎంత వర్ణించినా సరిపోదు.







