వైసీపి మంత్రులు, ఎమ్మెల్యేలు తమ శాఖలు, నియోజకవర్గాలకు సంబందించి ఏం పనులు చేస్తున్నారో తెలీదు కానీ పార్టీ అధిష్టానం సూచించినవారిపై అందరూ విరుచుకుపడుతుంటారు. మొదట నారా లోకేష్ వెంటబడ్డారు. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు వెంటపడ్డారు.
టిడిపి, జనసేనలు కలిసి పోటీ చేస్తాయని అనుమానం కలగగానే పవన్ కళ్యాణ్ వెంటపడ్డారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో సహా మంత్రులు, ఎమ్మెల్యేలు ఆయనను ఎంతగా అవహేళన చేశారో అందరూ చూశారు.
చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేయడంతో ప్రజల మద్యకు వచ్చిన ఆయన సతీమణి భువనేశ్వరిని, కోడలు బ్రాహ్మణి గురించి కూడా వైసీపి నేతలు చాలా అనుచిత వ్యాఖ్యలు చేశారు.
ఇప్పుడు వైసీపిలో అందరూ ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి వెంటపడుతున్నారు. ముందుగా వైసీపి ఎంపీ విజయ సాయిరెడ్డి ఆమెను విమర్శించడం మొదలుపెట్టారు. ఆ తర్వాత మంత్రో రోజా, పోసాని కూడా మొదలుపెట్టేశారు.
నేడో రేపో మంత్రులు అంబటి రాంబాబు, గుడివాడ అమర్నాథ్, ఎమ్మెల్యే కొడాలి నాని, దర్శకుడు రాంగోపాల్ వర్మ తదితరులు కూడా మీడియా, సోషల్ మీడియాలో దగ్గుబాటి పురందేశ్వరిని అవహేళన చేయకుండా ఉండరు. ఇంతకీ వీరందరూ అకస్మాత్తుగా ఆమెపై బాణాలు ఎందుకు ఎక్కుపెడుతున్నారు?అనే ప్రశ్నకు కొన్ని సమాధానాలు కనిపిస్తున్నాయి.
1. చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేసిన తర్వాత ఆమె మోడీ, అమిత్ షాలకు వాస్తవాలు వివరించి ఆయనకు ఈ కేసుల నుంచి విముక్తి కల్పించేందుకు ప్రయత్నిస్తున్నారని వైసీపి అనుమానిస్తుండవచ్చు.
2. ఆమె నారా లోకేష్ని వెంటబెట్టుకొని ప్రధాని నరేంద్రమోడీతో భేటీ అవడంతో, ఏపీలో టిడిపి, జనసేనలతో బీజేపీని కలిపేందుకు ప్రయత్నిస్తున్నారని వైసీపికి అనుమానం కలిగి ఉండవచ్చు.
3. జగన్, విజయ సాయిరెడ్డిల అక్రమాస్తుల కేసులను వేగవంతం చేసేందుకు ఆమె కేంద్ర ప్రభుత్వం, సుప్రీంకోర్టుపై ఒత్తిడి చేస్తుండటంతో వైసీపిలో ఆందోళన మొదలై ఉండవచ్చు.
4. ఎన్టీఆర్ కుటుంబంలో చిచ్చు పెట్టే ప్రయత్నం కావచ్చు.
వైసీపి నేతలు ఆమెను ద్వేషించడానికి ఇవన్నీ బలమైన కారణాలే కావచ్చు. కానీ చంద్రబాబు నాయుడుని అరెస్టు చేయడాన్నే తీవ్రంగా వ్యతిరేకించిన రాష్ట్ర ప్రజలు, ఇప్పుడు ఎన్టీఆర్ కుమార్తె అయిన దగ్గుబాటి పురందేశ్వరిపై మూకుమ్మడిగా దాడి చేస్తుంటే సమర్ధిస్తారా అని వైసీపి నేతలు ఆలోచించిన్నట్లు లేదు.
ఈవిదంగా నిత్యం ఎవరో ఓ ప్రముఖులను టార్గెట్ చేసుకొని మంత్రులు, ఎమ్మెల్యేలు అనుచితంగా మాట్లాడుతుంటే, తమ గురించి, తమ ప్రభుత్వం, పార్టీ గురించి ప్రజలలో వ్యతిరేకభావం పెరిగిపోదా?అంటే ‘ప్రజలు, ప్రతిపక్షాలు, మీడియా మా గురించి ఏమనుకొన్నా, ఎన్నికలలో ఎలా గెలవాలో మాకు బాగా తెలుసు కనుక మా ఇష్టం వచ్చిన్నట్లు మాట్లాడుతుంటాము. వ్యవహరిస్తుంటామని’ వైసీపి నేతలు భావిస్తున్నట్లున్నారు.
అయితే గతంలో ఇదేవిదంగా వ్యవహరించిన అనేకమంది నేతలు, పార్టీలు ప్రజాగ్రహానికి గురై కాలగర్భంలో కలిసిపోయారని గ్రహిస్తే వైసీపికే మంచిది.




