టీడీపీ-జనసేనలు పొత్తు పెట్టుకోకుండా అడ్డుకునేందుకు, పెట్టుకున్నాక వాటి మద్య చిచ్చు పెట్టి విడగొట్టేందుకు ‘సింగిల్ సింహం’ చేసిన కుట్రలు అందరికీ తెలుసు.
ఆ కుట్రలు ఫలించకపోయినా అవి కలిస్తే ఏమవుతుందో టీడీపీ, జనసేన నేతలు, కార్యకర్తల కంటే ముందే జగన్ పసిగట్టారు. ఆయన భయపడిన్నట్లే ఎన్నికలలో వైసీపీ తుడిచిపెట్టుకుపోయింది.
అంటే టీడీపీ-జనసేన విషయంలో జగన్ లెక్క తప్పలేదన్న మాట! కనుక వైసీపీ మళ్ళీ అధికారంలోకి వచ్చి తాను ముఖ్యమంత్రి అవ్వాలంటే వాటి మద్య ఏదోవిదంగా చిచ్చుపెట్టాలి. కూటమి ప్రభుత్వంలో నుంచి జనసేన బయటకు వచ్చేలా చేయాలని జగన్ ఫిక్స్ అయినట్లే ఉన్నారు.
అందుకే విజయసాయి రెడ్డి చేత చంద్రబాబు నాయుడుని తిట్టించి, “వయసు మళ్ళిన చంద్రబాబు నాయుడు కంటే యువకుడైన పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి పదవి చేపడితే రాష్ట్రానికి ఎంతో మేలు చేస్తారు,” అని ట్వీట్స్ వేయిస్తున్నారని అనుకోవచ్చు.
అందుకే చంద్రబాబు నాయుడు కుట్రలలో భాగస్వామి కావద్దని, ఆయన చెప్పిన్నట్లు ఆడొద్దని విజయసాయి రెడ్డి పవన్ కళ్యాణ్కి హితవు చెపుతున్నారనుకోవచ్చు.
ఎన్నికలకు ఏడాది ముందు నుంచి పవన్ కళ్యాణ్ని తమ మాటలతో రెచ్చగొట్టి టీడీపీతో చేతులు కలపకుండా అడ్డుకోవాలని జగన్, వైసీపీ నేతలు విశ్వప్రయత్నాలు చేశారు. అప్పుడు ఫలించలేదు కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయనతో పాటు జనసేన ముఖ్య నేతలు కూడా పదవులు, అధికారం రుచి చూశారు.
కనుక టీడీపీ-జనసేనల మద్య చిచ్చు పెట్టేందుకు నిరంతరంగా ప్రయత్నిస్తుంటే ఏదో రోజు ఫలించకపోదని జగన్ గట్టి నమ్మకంతో ఉన్నట్లున్నారు. బహుశః ఆ ధైర్యంతోనే మళ్ళీ మనమే అధికారంలోకి వస్తామని బల్లగుద్ది వాదిస్తున్నారని అనుమానించాల్సి ఉంటుంది.
అయితే జగన్ తమ మద్య చిచ్చు పెట్టేందుకు చేస్తున్న ప్రయత్నాలను టీడీపీ గమనించలేదని అనుకోలేము. టీడీపీ సీనియర్ నేత బుద్దా వెంకన్న విజయసాయి రెడ్డి కుట్రలను ధీటుగా తిప్పి కొడుతుండటమే కాక నేడు విజయవాడ పోలీస్ కమీషనర్ని కలిసి పిర్యాదు చేశారు.
విజయసాయి రెడ్డి కుట్ర పూరితంగా సిఎం చంద్రబాబు నాయుడు గురించి సోషల్ మీడియాలో అనుచితంగా పోస్టులు పెడుతున్నారని పిర్యాదు చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రిని అవమానించిన నేరానికి, సోషల్ మీడియాలో అనుచితమైన పోస్టులు పెడుతున్నందుకు విజయసాయి రెడ్డిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని సీపీని అభ్యర్ధించారు. అంటే విజయసాయి రెడ్డికి చెక్ పెట్టేందుకు గేమ్ ప్లాన్ రెడీ అయ్యింది మాట!
చంద్రబాబు నాయుడు, జనసేన, బీజేపిలతో పొత్తులు పెట్టుకోవడం అనైతికమని వాదించిన జగన్మోహన్ రెడ్డి, మరిప్పుడు చేస్తున్నది ఏమిటి?టీడీపీ-జనసేనల మద్య చిచ్చు పెట్టి అధికారంలోకి రావాలనుకోవడం నైతికమేనా?
అయినా రాష్ట్రంలో ప్రజలందరికీ మేలు చేశాను. 40 శాతం మంది ప్రజలు మనతోనే ఉన్నారని వాదిస్తున్నప్పుడు ఇటువంటి నీచ రాజకీయాలు చేయడం దేనికి?ఈ నాలుగున్నరేళ్ళలో మరో 10-15 శాతం మంది ప్రజలను తనవైపు తిప్పుకొని వారి ఓట్లతో ఎన్నికలలో గెలిచి అధికారంలోకి రావచ్చు కదా?




