కెప్టెన్సీ పగ్గాలు చేపట్టిన నాటి నుండి వరుస విజయాలతో దూసుకుపోతున్న టీమిండియా రధసారధి విరాట్ కోహ్లికి న్యూజిలాండ్ జట్టు భారీ షాక్ ఇచ్చింది. శ్రీలంకపై 5-0, ఆస్ట్రేలియాపై 4-1 తేడాతో సొంతగడ్డపై వరుస సిరీస్ విజయాలు సొంతం చేసుకున్న టీమిండియా, కివీస్ తో తలపడుతుంటే… ఎలాగూ గెలుస్తాం కదా… ఈ మ్యాచ్ లు కూడా ఏం చూస్తాంలే అన్న నమ్మకం క్రీడాభిమానులలో వ్యక్తమయ్యింది. అయితే ఆ రోజు ఎవరైతే అత్యుత్తమ ప్రదర్శన ఇస్తారో వారిదే ఆధిపత్యం అని ‘జెంటిల్మెన్ గేమ్’ మరోసారి నిరూపించింది.
టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేపట్టిన టీమిండియా ఆదిలోనే ఓపెనర్లు శిఖర్ ధావన్, రోహిత్ శర్మ వికెట్లను కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. దీనికి తోడు కేదార్ జాదవ్ కూడా వెనువెంటనే అవుట్ కావడంతో భారమంతా కెప్టెన్ విరాట్ కోహ్లి మరియు దినేష్ కార్తీక్ లపై పడింది. నింపాదిగా ఆడుతూ స్కోర్ బోర్డును ముందుకు కదిలిస్తున్న తరుణంలో దినేష్ కార్తీక్ (37) పరుగులకు అవుట్ అయినప్పటికీ, మరో ఎండ్ లో కోహ్లి అండగా నిలిచాడు. కెరీర్ లో 200వ వన్డే ఆడుతోన్న కోహ్లి 31వ సెంచరీని నమోదు చేసి టీమిండియా 280 పరుగుల గౌరవప్రదమైన స్కోర్ కు కారణమయ్యాడు.
125 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్సర్లతో 121 పరుగులు చేసిన కోహ్లి చివరి ఓవర్లో పెవిలియన్ చేరుకున్నాడు. కోహ్లి సెంచరీ చేయడం టీమిండియా విజయం సాధించడం షరామామూలే అయిపోయిన తరుణంలో… ఈ మ్యాచ్ లో కూడా విజయం తధ్యం అనుకున్న క్రికెట్ ప్రేమికులకు రాస్ టేలర్ (95) – వికెట్ కీపర్ లతం(103 నాటౌట్)ల జోడి భారీ షాక్ ఇచ్చింది. వీరిద్దరి 200 పరుగుల భాగస్వామ్యంతో కివీస్ జట్టు మరో ఓవర్ మిగిలి ఉండగానే లక్ష్యాన్ని అందుకుని, మూడు వన్డేల సిరీస్ లో 1-0 ఆధిక్యంలో నిలిచింది.
కెప్టెన్ గా ఇప్పటివరకు 19 సెంచరీలు చేసిన విరాట్ కోహ్లి, తొలి పరాజయాన్ని చవిచూసాడు. అలాగే సొంతగడ్డపై కోహ్లి చేసిన సెంచరీ కూడా వృధా కావడం ఇదే తొలిసారి. 200వ వన్డేలో సెంచరీ చేసిన జ్ఞాపకం మధురానుభూతిని పంచకపోవడం విశేషం. వన్డే క్రికెట్ లో ఫాస్టెస్ట్ 31 సెంచరీల రికార్డ్ ను అందుకున్న కోహ్లి, కెప్టెన్ గా కూడా ఫాస్టెస్ట్ 19 సెంచరీలను అందుకుని మరో రికార్డు కైవసం చేసుకున్నాడు. 2009లో ఒక్క సెంచరీ ఉన్న కోహ్లి 2017 చివరంకాం చేరుకునే పాటికి 31 సెంచరీలకు చేరుకోవడం సామాన్యమైన విషయం కాదు. మొదటి 100 వన్డేలలో 13 సెంచరీలను చేసిన కోహ్లి, తదుపరి 100 వన్డేలలో 18 సెంచరీలను నమోదు చేసాడు.


