శ్రీలంక పర్యటనలో ఉన్న భారత క్రికెట్ జట్టు విజయాల బాటలో నడుస్తోంది. మూడు టెస్టుల సిరీస్ ను మరో టెస్ట్ మిగిలి ఉండగానే సొంతం చేసుకున్న కోహ్లీ సేన మరో అరుదైన ఘనత సాధించింది. లంకపై వరుసగా రెండు సిరీస్ లను గెలిపించిన కెప్టెన్గా కోహ్లీ రికార్డులకెక్కాడు. భారత్ కు ప్రపంచ వన్డే కప్, టీ20 ప్రపంచ కప్ లు అందించిన మాజీ కెప్టెన్ ధోనీకి కూడా ఇది సాధ్యం కాలేదు.
ఆతిథ్య దేశంపై ఇన్నింగ్స్ తేడాతో విజయం సాధించడం కూడా భారత్ కు ఇదే తొలిసారి. కాగా, కొలంబోలో జరిగిన టెస్ట్ లో భారత్ తొలి ఇన్నింగ్స్ లో 622 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. అనంతరం బరిలోకి దిగిన శ్రీలంక తొలి ఇన్నింగ్స్ లో 183 పరుగులకు ఆలౌట్ కాగా, ఫాలో ఆన్లో 386 పరుగులకు ఆలౌటై ఘోర పరాభావాన్ని మూటగట్టుకుంది.
ఇదిలా ఉంటే ఈ టెస్ట్ లో టీమిండియా వైస్ కెప్టెన్ అజింక్య రహానే అరుదైన ఘనత సాధించాడు. టెస్టుల్లో అత్యంత వేగంగా 50 క్యాచ్లు అందుకున్న భారత ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. రహానే కేవలం 39 టెస్టుల్లోనే 50 క్యాచ్లు అందుకున్నాడు. అతడి కంటే ముందు టీమిండియా మాజీ ఆటగాడు ఏక్నాథ్ సోల్కర్ 26 టెస్టుల్లోనే ఈ ఘనత సాధించాడు. రెండో టెస్ట్ లో ఏకంగా 5 క్యాచ్లు అందుకుని జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.


