ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి గత నాలుగేళ్ళుగా పరిశ్రమలు, ఐటి కంపెనీలు పొరుగు రాష్ట్రాలకి తరలిపోతున్న సంగతి తెలిసిందే. వాటితో పాటు వేలాదిమంది నిరుద్యోగ యువత డిగ్రీలు చేతపట్టుకొని ఉద్యోగాలు, ఉపాధి కోసం హైదరాబాద్ వెళుతున్నారు.
పిల్లలు అక్కడ స్థిరపడుతుండటంతో ఆంధ్రా నుంచి ప్రతీరోజూ వందల కుటుంబాలు మూటాముల్లె సర్దుకొని హైదరాబాద్ తరలిపోతున్నారు. ఏపీ, తెలంగాణ సరిహద్దు చెక్ పోస్టుల వద్ద ఇంటి సామానుతో క్యూ కడుతున్న లారీలను చూస్తున్నవారు “ఆంధ్రాలో ఏమైంది?అందరూ హైదరాబాద్కు వెళ్ళిపోతున్నారు?” అని ప్రశ్నిస్తున్నారు. చెక్ పోస్టుల వద్ద ఏపీ నుంచి హైదరాబాద్ తరలిపోయే కుటుంబాలే కానీ తెలంగాణ నుంచి ఏపీకి వచ్చేవారు ఒక్కరూ కనబడరు!ఏపీ దుస్థితికి ఇంతకంటే నిదర్శనం ఏం కావాలి?
పరిశ్రమలు, ఐటి కంపెనీలు హైదరాబాద్కు తరలిపోతుండటం చూసి ఇప్పుడు ఎవరూ ఆశ్చర్యపడటంలేదు. కానీ జగన్మోహన్ రెడ్డిని ఎంతగానో అభిమానించే విశాఖ శారదా పీఠాధిపతి శ్రీ స్వరూపానందేంద్ర స్వామీజీ కూడా హైదరాబాద్ తరలిపోతుండటమే చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. ఆయనే స్వయంగా నిన్న ఈ విషయం ప్రకటించారు.
విశాఖ శారదా పీఠంలో స్వామీజీ నిన్న తన 59వ జన్మదినోత్సవం జరుపుకొన్నారు. ఈ సందర్భంగా భక్తులను ఉద్దేశ్యించి మాట్లాడుతూ, “విశాఖలో ఇదే నా చివరి జన్మదినోత్సవం. వచ్చే ఏడాది హైదరాబాద్ కోకాపేటలోని శారదాపీఠంలో ఆధ్యాత్మిక అధ్యయన కేంద్రంలో నా షష్టిపూర్తి జరుపుకొంటాను. ఆదిశంకరుల అద్వైత తత్వంపై పరిశోధనలు చేస్తూ అక్కడే నా శేషజీవితం గడుపుతాను,” అని చెప్పారు.
శారదా పీఠానికి వచ్చే భక్తులు, చివరికి శిష్యులు కూడా ఆయనను తాకేందుకు సాహసించారు. ఎవరినీ తాకని స్వామీజీ క్రీస్టియన్ మతాన్ని అనుసరిస్తున్న జగన్మోహన్ రెడ్డిని ఆప్యాయంగా కౌగలించుకొంటారు! జగన్ కూడా ఆయనను చాలా గౌరవిస్తారు. పలు అంశాలపై ఆయన సలహాలు తీసుకొంటారు. విశాఖ వచ్చినప్పుడల్లా తప్పకుండా ఆయనను దర్శించుకొంటారు. జగన్ ఆస్థాన గురువుగారైన స్వరూపానందేంద్ర స్వామీజీ కూడా ఏపీ శాసనసభ ఎన్నికలకు ముందు ఇటువంటి నిర్ణయం తీసుకోవడం చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది.
సర్వసంగపరిత్యాగి అయిన స్వామీజీకి విశాఖ, హైదరాబాద్, రాజస్థాన్ ఎడారి లేదా హిమాలయాలైనా ఒక్కటే. వారు ఎక్కడైనా తమ పరిశోధనలు చేయవచ్చు. కానీ కోకాపేటలో ఆశ్రమం ఏర్పాటు చేసుకొని వెళ్ళిపోతున్నారు!
తెలంగాణ సిఎం కేసీఆర్ త్రిదండి చిన్న జియ్యర్ స్వామీజీని పక్కన పెట్టేసిన తర్వాత శ్రీ స్వరూపానందేంద్ర స్వామీజీని గురువుగా స్వీకరించి ఆయన సూచనలు, సలహాల మేరకు యజ్ఞయాగాదులు చేస్తున్నారు. అందుకే ఆయన హైదరాబాద్ వెళ్ళిపోవాలనుకొంటున్నారా?లేదా ఆంద్రాలో రాజకీయాలను భరించలేకనే హైదరాబాద్ వెళ్ళిపోతున్నారా?అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.
ఆంధ్రా నుంచి పరిశ్రమలు, ఐటి కంపెనీలు హైదరాబాద్ తరలిపోవడం ఆశ్చర్యం కాదు. కానీ మూడు దశాబ్ధాలుగా విశాఖ ప్రజలకు ఆధ్యాత్మిక బోధనలు చేస్తూ భక్తి మార్గంలో నడిపిస్తున్న స్వరూపానందేంద్ర స్వామీజీ కూడా హైదరాబాద్ తరలిపోతుండటమే విశాఖ ప్రజలను ఎక్కువ బాధిస్తుంది అని చెప్పక తప్పదు.




