ప్రముఖ నటుడు విశాల్ పై కోలీవుడ్ నిర్మాతల మండలి నిషేధం ఎత్తివేసింది. నిర్మాతల మండలి నుంచి అకారణంగా సస్పెండ్ చేశారని ఆరోపిస్తూ విశాల్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. దీనిని విచారించిన మద్రాసు హైకోర్టు విశాల్ వ్యాఖ్యల్లో తప్పేముందని ప్రశ్నించింది. దేశంలో అందరికీ వాక్ స్వాతంత్ర్యం ఉందని, ఒకవేళ చేసిన వ్యాఖ్యల్లో తప్పులుంటే న్యాయస్థానం లేదా అసెంబ్లీ చర్యలు తీసుకుంటాయని మద్రాసు హైకోర్టు స్పష్టం చేసింది. వెంటనే ఆయనపై సస్పెన్షన్ ఉత్తర్వులు ఎత్తివేయాలని ఆదేశాలు జారీ చేసింది. దీంతో నిర్మాతల మండలి విశాల్ పై నిషేధం ఎత్తివేసినట్టు ప్రకటించింది.
దక్షిణభారత చలన చిత్ర మండలి ప్రధాన కార్యదర్శిగా ఉన్న విశాల్ కు నిర్మాతల మండలిలో కూడా సభ్యత్వం ఉంది. విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీ బ్యానర్ పై పలు సినిమాలు నిర్మించిన సంగతి తెలిసిందే. త్వరలో జరగనున్న నిర్మాతల మండలి ఎన్నికల్లో విశాల్ పోటీ చేయనున్నారు. ఈ నేపథ్యంలో నిర్మాతల మండలి కట్ట పంచాయతీలు నిర్వహిస్తోందని మండిపడ్డారు. దీనిపై మండిపడ్డ నిర్మాతల మండలి అతనిపై నిషేధం విధించిన సంగతి తెలిసిందే. కాగా దీనిని విశాల్ విజయంగా కోలీవుడ్ అభిమానులు పేర్కొంటున్నారు.



