Waqf Amendment Bill Supreme Court Petitions

సామాన్య ప్రజలకు మేలు కలిగించేందుకు రూపొందించిన కొన్ని చట్టాలు, పధకాలు, కార్యక్రమాలు వారి కంటే రాజకీయ పార్టీలే ఎక్కువగా ఉపయోగించుకుంటాయి. ఆ పేరుతో రాజకీయాలు చేస్తూ లబ్ధి పొందుతుంటాయి. కానీ ఇవి సామాన్య ప్రజల పరిధికి మించి సాగుతుంటాయి కనుక వారు కూడా వాటి గురించి ఎక్కువగా ఆలోచించరు.

ఇందుకు తాజా ఉదాహరణగా వక్ఫ్ చట్ట సవరణ కనిపిస్తోంది. వక్ఫ్ బోర్డు, వక్ఫ్ ఆస్తుల వలన నిరుపేద ముస్లింలకు ఏమేరకు లబ్ధి పొందుతున్నారనే విషయం ఎవరికీ తెలియదు. ‘వక్ఫ్’ అంటే బ్రహ్మపదార్ధం… దాని లోతుపాతులు ఎవరికీ తెలియవు కానీ ముస్లింల ఓట్లు ఎలా పొందాలో ప్రతీ రాజకీయ పార్టీకి బాగా తెలుసు.

Also Read – వైసీపీ నేతలందరూ ఇలా ప్రత్యక్షమయ్యారేమిటి?

అందుకే దేశంలో లౌకికవాద ముసుగు వేసుకున్న రాజకీయ పార్టీలు, ముస్లింలపై పేటెంట్ హక్కులు పొందిన్నట్లు భావిస్తున్నవారు వక్ఫ్ చట్ట సవరణలని తీవ్రంగా వ్యతిరేకించారు. కానీ అది చట్ట రూపం దాల్చడంతో హడావుడిగా సుప్రీంకోర్టులో పిటిషన్లు వేశారు.

వారందరూ ముస్లింలపై అవ్యాజయమైన ప్రేమతోనే పిటిషన్లు వేశారా? అంటే కాదనే చెప్పాలి. దేశంలో ముస్లింల సంక్షేమం, వారి జీవన ప్రమాణాల మెరుగు పరచడంపై శ్రద్ద చూపాల్సిన రాజకీయ పార్టీలు వారిని కేవలం ఓట్లు వేసే యంత్రాలుగా మాత్రమే చూస్తున్న సంగతి రహాస్యమేమీ కాదు. కనుక వారికి ఉపయోగపడుతోందో లేదో తెలియని ‘వక్ఫ్’ కోసం అందరూ పోరాడేస్తున్నారు.

Also Read – వైసీపీ వేణు స్వామి ని ఆశ్రయించాలేమో..!

వక్ఫ్ చట్ట సవరణలని సవాలు చేస్తూ, వ్యతిరేకిస్తూ, రద్దు చేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో ఏకంగా 75 పిటిషన్లు దాఖలు అవడమే ఇందుకు చక్కటి నిదర్శనం. దాని మంచి చెడ్డలని సుప్రీంకోర్టు ఎలాగూ నిగ్గు తేల్చి చెపుతుంది కనుక ఇప్పుడే దాని లోతుపాతులపై చర్చించడం అనవసరం.

ఈ పిటిషన్లపై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం వక్ఫ్ చట్ట సవరణలో వక్ఫ్ ఆస్తులను డీ నోటిఫై చేసే అధికారం, వక్ఫ్ సంస్థలలో ముస్లిమేతరుల నియామకాలపై స్టే విధించాలనుకుంది. కానీ కేంద్ర ప్రభుత్వం తరపున వాదనలు కూడా పూర్తిగా విన్న తర్వాత నిర్ణయం తీసుకోవాలని సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా అభ్యర్ధనపై సానుకూలంగా స్పందించి ఈ కేసు తదుపరి విచారణని ఈరోజు (గురువారం) మద్యాహ్నం 2 గంటలకి వాయిదా వేసింది.

Also Read – బిఆర్ఎస్ పార్టీలో ఏం జరుగుతోంది?

మతంతో ముడిపడి సున్నితమైన ఈ వక్ఫ్ కేసుపై సుప్రీంకోర్టు ఏవిదంగా తీర్పు చెపుతుందో తెలీదు కానీ దేశంలో అన్ని రాజకీయ పార్టీలు ఈ కేసుని, తీర్పుని ఉపయోగించుకొని రాజకీయ మైలేజ్ పొందేందుకు ప్రయత్నించడం మాత్రం ఖాయమే.