ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కుమారుడు రాజారెడ్డి, అట్లూరి ప్రియల వివాహం రాజస్థాన్లోని జోధ్పూర్ ప్యాలస్లో నేడు వైభవంగా జరిగింది. వారి వివాహానికి విజయమ్మతో సహా బంధుమిత్రులు హాజరయ్యి నూతన వధూవరులను ఆశీర్వదించారు.
కానీ చెల్లి వైఎస్ షర్మిల ఇంట్లో జరుగుతున్న ఈ తొలి శుభ కార్యక్రమానికి జగన్మోహన్ రెడ్డి దంపతులు హాజరుకాలేదు!
వైఎస్ షర్మిల ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలుగా బాధ్యతలు చేపట్టి అన్న జగన్మోహన్ రెడ్డిని తీవ్రంగా విమర్శిస్తుండటమే ఇందుకు కారణమని అందరికీ తెలుసు. కనుక ఈ రాజకీయ పరిణామాలే వారి కుటుంబ సంబంధాలను దెబ్బ తీశాయని అనుకోవడానికి లేదు. అసలు షర్మిలకు తన సొంత అన్నతో ఎందుకు ఇంత శతృత్వం ఏర్పడింది?అని ముందుగా ఆలోచించవలసి ఉంటుంది.
ఆస్తుల పంపకాలు, పదవుల పంపకాలలో ఆమెకు జగన్ అన్యాయం చేయడం వలననే ఆమె ఆంధ్రా వదిలి తెలంగాణకు వెళ్ళిపోరు. అక్కడా ఆమె అనేక అగచాట్లు, అవమానాలు భరించారు. కనుక తన ఈ దుస్థితికి అన్న జగన్మోహన్ రెడ్డే కారణమని ఆమె ఆగ్రహం కలగడం సహజమే కదా? అయినా ఆమె ఏనాడూ అన్నను పల్లెత్తు మాట అనకుండా తెలంగాణలో తన తిప్పలు ఏవో తాను పడ్డారు.
కానీ అక్కడా ఆమె రాజకీయ జీవితం ఆగమ్యగోచరంగా మారి దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నప్పుడు, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన గొప్ప అవకాశాన్ని అందిపుచ్చుకుని ఏపీలోకి వచ్చిపడ్డారు. కానీ చంద్రబాబు నాయుడే ఆమెను ఏపీకి రప్పించారని జగన్ అనుమానిస్తూ, తన ‘కాలకేయ సైన్యం’తో ఆమెపై దాడి చేయిస్తున్నారు.
వైఎస్ షర్మిల వైఎస్ కుటుంబం పరువును రోడ్డుకీడ్చుతున్నారని, సొంత అన్నను గద్దె దించడానికి ప్రతిపక్షాలతో చేతులు కలిపి కుట్రలు చేస్తున్నారని వైసీపి మంత్రులు, ఎమ్మెల్యేల చేత జగన్మోహన్ రెడ్డి ఆరోపణలు చేయిస్తున్న సంగతి తెలిసిందే. అయితే వారితో ఆవిదంగా సొంత చెల్లెలిపైనే ఆరోపణలు చేయిస్తూ, జగన్ కూడా వైఎస్ కుటుంబం పరువు బజారుకీడ్చుతున్నారు కదా?
ఈ నేపధ్యంలో షర్మిల రాజకీయ ప్రస్థానం గమనిస్తే ఆమెపై ‘కాలాకేయ సైన్యం’ చేస్తున్న విమర్శలు, ఆరోపణలన్నీ నాణేనికి ఒకవైపు చూపుతున్నట్లే భావించవచ్చు.
కానీ తనతో అన్న ఈవిదంగా వ్యవహరిస్తున్నప్పటికీ వైఎస్ షర్మిల మాత్రం పద్దతిగా కొడుకు, కాబోయే కోడలిని వెంటబెట్టుకుని అన్న ఇంటికి వెళ్ళి అన్నావదినలకు శుభలేఖ ఇచ్చి ఆహ్వానించిన సంగతి, వారి వివాహ నిశ్చితార్దానికి జగన్ దంపతులు హాజరవడం అందరికీ తెలిసిందే.
కానీ ముఖ్యమైన కార్యక్రమం మేనల్లుడు పెళ్ళికి జగన్ దంపతులు వెళ్ళకుండా స్వయంగా విమర్శలకు అవకాశం కల్పించిన్నట్లయింది. బహుశః హైదరాబాద్లో వారి రెసిప్షన్కు హాజరవుతారేమో? కాకపోతే విమర్శలకు మరోసారి అవకాశం కల్పించిన్నట్లవుతుంది… అంతే కదా!





