తెలంగాణలో తిరుగే లేదనుకొన్న కేసీఆర్ & కో కాంగ్రెస్ చేతిలో ఓడిపోవడమే పెద్ద షాక్ అనుకొంటే, అధికారంలో లేకపోయినా తమలో తాము కీచులాడుకొంటూ కాలక్షేపం చేసే కాంగ్రెస్ పార్టీ చేతిలో ఓడిపోవడం చాలా దిగ్బ్రాంతి కలిగించేదే.
తెలంగాణ ఎన్నికలు పూర్తయ్యేవరకు కూడా కాంగ్రెస్ సీనియర్లు ఎవరూ రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని అంగీకరించలేదనే విషయం అందరికీ తెలిసిందే. కానీ బిఆర్ఎస్ పార్టీలో కేసీఆర్, కేటీఆర్ నాయకత్వాన్ని హరీష్ రావు వంటి సీనియర్ కూడా ప్రశ్నించలేరు. ప్రశ్నిస్తే ఈటల రాజేందర్కి పట్టిన గతే పడుతుంది.
కనుక కేసీఆర్ని ఓడించిన క్రెడిట్, కాంగ్రెస్ని గెలిపించిన క్రెడిట్ రెండూ కూడా ఖచ్చితంగా రేవంత్ రెడ్డికే దక్కుతాయి. అదేవిదంగా తన అహంకారంతో బిఆర్ఎస్ పార్టీని ఓడించుకొన్న క్రెడిట్ కేసీఆర్, కేటీఆర్ల పద్దులోనే వ్రాయాల్సి ఉంటుంది.
అయితే తెలంగాణ ఎన్నికల నుంచి నేర్చుకోవలసిన ముఖ్యమైన ఈ గుణపాఠాన్ని జగన్మోహన్ రెడ్డి పట్టించుకోకుండా, ‘సిట్టింగ్ ఎమ్మెల్యేలను మార్చకుండా ఎన్నికలకు వెళితే ఓడిపోయే ప్రమాదం ఉంటుంది,’ అనే ఒక్కటే పాయింట్ క్యాచ్ చేసి హడావుడిగా ఎమ్మెల్యేలను మార్చేస్తున్నారు.
కానీ కేసీఆర్ నిజంగా సిట్టింగ్ ఎమ్మెల్యేలతో ఎన్నికలకు వెళ్ళడం వలనే ఓడిపోయారా?అంటే కాదనే చెప్పాలి. తెలంగాణ ప్రజలు కేసీఆర్ అహంభావాన్నే ఓడించారు తప్ప బిఆర్ఎస్ పార్టీని కాదనే చెప్పాలి. ఒకవేళ బిఆర్ఎస్ పార్టీని ఓడించాలని ప్రజలు నిర్ణయించుకొని ఉంటే ఆ పార్టీకి ఆ 39 సీట్లు కూడా దక్కేవి కావు. కాంగ్రెస్ పార్టీ కేవలం 64 సీట్లతో సరిపెట్టకుండా 80-90 సీట్లైనా కట్టబెట్టి ఉండేవారు కదా?
ఏపీలో వైసీపి నేతలు కూడా పైనుంచి క్రిందవరకు కేసీఆర్ని మించిన అహంభావం ప్రదర్శిస్తుండటం అందరూ చూస్తూనే ఉన్నారు. మీడియా ముందుకు వచ్చి వారు మాట్లాడే లేకిమాటలు, మీడియా, ప్రతిపక్షాలు, ముఖ్యంగా బడుగు బలహీనవర్గాల ప్రజల పట్ల వారు ప్రదర్శించే చులకనభావం, రాష్ట్రాబివృద్ధి, ప్రజాసమస్యలపట్ల వారి అలసత్వం… ఒకటా రెండా…చెప్పుకోవాలంటే అనేకం ఉన్నాయి.
కేసీఆర్ ఎంత అహంకారం ప్రదర్శించినా తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తూనే ఉన్నారు. కానీ వైసీపి ప్రభుత్వం అహంభావం ప్రదర్శించడమే తప్ప ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చేయలేకపోయింది. కేసీఆర్ అహంకారంతో వ్యవహరించడం వలననే బిఆర్ఎస్ పార్టీ ఓడిపోయిందని స్పష్టంగా తెలుస్తున్నప్పుడు, వైసీపి ఎమ్మెల్యేలను మార్చేస్తే ఏపీ ప్రజలు వైసీపిని మళ్ళీ గెలిపించేస్తారనుకోవడం ప్రజల విజ్ఞతపై కూడా వైసీపికి ఎంత చిన్నచూపు ఉందో తెలియజేస్తోంది.
నాలుగున్నరేళ్ళ తర్వాత జగన్మోహన్ రెడ్డే తన ఎమ్మెల్యేలు పనికిరారని నిర్ధారించుకొని మార్చేస్తున్నప్పుడు వారు వేరే చోట నుంచి పోటీ చేస్తే ఎందుకు గెలిపించాలి?తమ స్థానంలో మరొకరు ఎవరైనా పోటీ చేస్తే వైసీపిని మళ్ళీ ఎందుకు గెలిపించాలో ఆ పార్టీ నేతలు ఎవరైనా చెప్పగలరా?




