వైట్‌హౌస్‌ వద్ద కాల్పులు ఉగ్రవాదమైతే మరి ఢిల్లీ బాంబ్ బ్లాస్ట్?

Scene of White House shooting incident involving Afghanistan national

వైట్‌హౌస్‌ సమీపంలో అఫ్ఘనిస్తాన్‌కు చెందిన ఓ వ్యక్తి తుపాకీతో కాల్పులు జరపడం కలకలం సృష్టించింది. నేషనల్ గార్డ్స్ (భద్రతా దళాలు) వెంటనే ఎదురు కాల్పులు జరిపి అతనిని బందీగా పట్టుకున్నాయి. ఈ ఘటనపై ట్రంప్‌ స్పందన చాలా అనూహ్యంగా ఉంది.

“ఇది ఖచ్చితంగా ఉగ్రదాడే. ఈ దాడికి పాల్పడిన ఆ మాన మృగం ఈ భూమిపైనే అత్యంత ప్రమాదకరమైన అఫ్ఘనిస్తాన్‌ దేశానికి చెందినవాడు. మాజీ అధ్యక్షుడు జో బైడేన్ లోపభూయిష్టమైన నిర్ణయాల వలన అతను, ఆ దేశం నుంచి పలువురు శరణార్ధులుగా అమెరికాలో అడుగు పెట్టగలిగారు. కనుక వారందరినీ మరోసారి విచారించి వెనక్కు తిప్పి పంపాల్సిన అవసరం ఉంది,” అని ట్రంప్‌ అన్నారు.

ADVERTISEMENT

వైట్‌హౌస్‌ వద్ద కాల్పులు జరిగితే అందుకు మాజీ అధ్యక్షుడు జో బైడెన్ని ట్రంప్‌ నిందించడం విడ్డూరంగా ఉంటుంది. అఫ్ఘనిస్తాన్‌ శరణార్ధులు అమెరికాకు రావడానికి కారణం జో బైడెన్ కాదు.. ట్రంపే కారణం.

ఇదివరకు ట్రంప్‌ అధ్యక్షుడుగా ఉన్నప్పుడు అఫ్ఘనిస్తాన్‌లోని అమెరికా సేనలను ఉపసంహరించారు. వెంటనే తాలిబన్లు ప్రభుత్వ పగ్గాలు చేతిలోకి తీసుకొని ప్రజలకు, ముఖ్యంగా మహిళలకు నరకం చూపిస్తున్నారు. అది భరించలేకనే లక్షల మంది అఫ్ఘనిస్తాన్‌ ప్రజలు ఇరుగు పొరుగు దేశాలకు, యూరప్, అమెరికా దేశాలకు శరణార్ధులుగా వెళ్ళారు. వారికి జో బైడెన్ మానవతా దృక్పదంతో ఆశ్రయం ఇచ్చారు.

కానీ వారిలో ట్రంప్‌ వలన తమకు, తమ దేశానికి తీరని నష్టం కలిగిందని భావిస్తున్న ఇటువంటి వారు తమ ఆగ్రహాన్ని ఈ రూపంగా ప్రదర్శించారనుకోవచ్చు. ఏది ఏమైనప్పటికీ వైట్‌హౌస్‌ వద్ద కాల్పులు జరుపడం తీవ్రమైన నేరమే. ఎటువంటి సందేహం లేదు.

కానీ అమెరికాలో ఓ విదేశీయుడు తుపాకీ కాల్పులు జరిపితే భయంకరమైన ఉగ్రవాదమైనప్పుడు, భారత్‌ రాజధాని ఢిల్లీలో కారు బాంబు ప్రేలుడు, గతంలో జరిగిన అనేక దాడులు అంతకంటే తీవ్రమైనవే కదా?అవి కూడా ఉగ్రవాద చర్యలే కదా?

కానీ ఆ ఉగ్రవాదులను భారత్‌పైకి ఉసిగొల్పుతున్న పాకిస్తాన్‌ని ట్రంప్‌ వెనకేసుకు వచ్చారు. ప్రధాని మోడీ ఉగ్రవాదానికి వ్యతిరేకంగా చేతులు కలుపుదామని పదేపదే కోరుతుంటే, ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాక్‌ పట్ల ట్రంప్‌ అనిర్వచనీయమైన ప్రేమ చూపారు.

భారత్‌-పాక్‌ యుద్ధం ఆపి పాక్‌ని కాపాడేందుకు భారత్‌పై వాణిజ్య ఆంక్షలు విధిస్తామని బెదిరించానని గొప్పగా చెప్పుకున్నారు. కనుక అమెరికాపై దాడి జరిగితేనే అది తీవ్రమైన ఉగ్రవాదంగా పరిగణిస్తారు లేకుంటే దాయాది దేశాల మద్య శత్రుత్వం కారణంగా జరుగుతున్న ఘర్షణలుగా చూస్తారు. అలాగే ట్రీట్‌మెంట్‌ చేస్తారన్న మాట!

ADVERTISEMENT
Latest Stories