జగన్ 5 ఏళ్ళ పాటు సంక్షేమ పధకాలతోనే కాలక్షేపం చేసి రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారు. కూటమి ప్రభుత్వంపై ఆ రుణభారం ఇంకా అలాగే ఉంది. రాష్ట్రానికి భారీగా పరిశ్రమలు, పెట్టుబడులు వస్తున్నా అవన్నీ ఇంకా ఆచరణలోకి రాలేదు.
కనుక వాటి ద్వారా రాష్ట్రానికి భారీగా ఆదాయం వచ్చేస్తోందని అనుకోలేము. ప్రధాని మోడీ నవ్వుతూ మాట్లాడున్నారే తప్ప రాష్ట్రానికి నిధులు విదిలించడం లేదు. ఇదివరకు జగన్కి ఇప్పించినట్లే అప్పులు ఇప్పిస్తున్నారు అంతే.
కనుక రాష్ట్రానికి అప్పులు ఇంకా పెరుగుతున్నాయి తప్ప ఆదాయం పెరగలేదు. ఇటువంటి పరిస్థితిలో సిఎం చంద్రబాబు నాయుడు వరుసగా సంక్షేమ పధకాలను అమలు చేస్తుండటం ఆశ్చర్యం కలిగిస్తుంది.
దీపం పధకం, మత్స్యకారులకు భరోసా, తల్లికి వందనం వంటి కొన్ని పధకాలకు నిధులు విడుదల చేశారు. ఈ నెల 20న అన్నదాత సుఖీభవ పధకం అమలుచేసేందుకు సన్నాహాలు ప్రారంభించింది కూటమి ప్రభుత్వం.
కేంద్రం ఇచ్చే రూ.6,000 కి మరో రూ.14,000 కలిపి మొత్తం రూ.20,000 మూడు వాయిదాలలో చెల్లిస్తామని ప్రభుత్వం ప్రకటించింది.
ఆగస్ట్ 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని సిఎం చంద్రబాబు నాయుడు స్వయంగా ప్రకటించారు. ఇంకా మరికొన్ని పధకాలు అమలుచేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు.
వృద్ధులు, వికలాంగులు, ఒంటరి మహిళలకు ఎంత పింఛన్ చెల్లించినా తప్పు లేదు. కానీ రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్నప్పుడు, వైసీపీ విమర్శలు, ఒత్తిళ్ళకు తలొగ్గి లేదా ‘ఇది మంచి ప్రభుత్వం’ అని అనిపించుకోవడానికో ఈవిదంగా డబ్బులు పంచిపెడుతుంటే, ప్రభుత్వంపై ఆర్ధిక భారం ఇంకా పెరుగుతూనే ఉంటుంది కదా?
ఆ భారాన్ని మళ్ళీ ప్రజల మీద వేయక తప్పదు. అప్పుడు కూడా ప్రభుత్వం పన్నులు, విద్యుత్ ఛార్జీలు, బస్సు ఛార్జీలు పెంచి ప్రజలను పీడిస్తోందని వైసీపీ విమర్శించకుండా ఉంటుందా? జగన్ ప్రభుత్వం కంటే ఎక్కువ ఇస్తున్నామని గొప్పగా చెప్పుకోవడానికి, వినడానికి బాగానే ఉంది. కానీ ఈ పధకాల భారం మళ్ళీ ప్రజలపై వేయనంత వరకే.. ఒకసారి వేస్తే కూటమి ప్రభుత్వంపై కూడా వ్యతిరేకత ఏర్పడుతుంది. ఏర్పడకపోతే ఏర్పడేలా వైసీపీ చేస్తుంది.
సంక్షేమ పధకాల పేరుతో జగన్ ప్రజలకు లక్షల కోట్లు పంచిపెట్టినా ఎన్నికలలో ఓడిపోయారు కదా? అంటే సంక్షేమ పధకాలతో అప్పనంగా లభించే డబ్బుని చూసి ప్రజలు ఓట్లు వేయరని జగన్ ఓటమితో నిరూపించబడినప్పుడు వాటి అమలుకి కూటమి ప్రభుత్వం ఎందుకు ఇంత హడావుడి పడుతోంది?






