ప్రస్తుతం పాకిస్థాన్ పరిస్థితి చాలా దయనీయంగా ఉందని యావత్ ప్రపంచానికి తెలుసు. సౌదీ అరేబియా, చైనా, ఐఎంఎఫ్ ఎప్పటికప్పుడు సాయం చేయకపోతే పాకిస్థాన్ ఎప్పుడో కుప్పకూలిపోయేది. కానీ పాక్ పాలకులు తమ అసమర్ధతని, వైఫల్యాలని కప్పిపుచ్చుకునేందుకు భారత్ని బూచిగా చూపిస్తుంటే, పాక్ సైన్యాధికారులు తమ యుద్ధోన్మాదం చల్లార్చుకోవడానికి భారత్తో యుద్ధానికి కాలు దువ్వుతున్నారు.
సింధూ జలాలపై భారత్ అధికార ప్రకటన చేసింది కానీ దానిని అమలు చేయాలంటే కనీసం 1-2 ఏళ్ళుపైనే పడుతుంది. కనుక దాని వలన ఇప్పటికిప్పుడు పాకిస్థాన్కి ఎటువంటి సమస్య తలెత్తదు.
కానీ పాకిస్థాన్ ‘సీమ్లా ఒప్పందం’ రద్దు చేసుకున్న మరుక్షణం నుంచే ‘లైన్ ఆఫ్ కంట్రోల్’ నియంత్రణ తొలగించేసినట్లయింది.
కనుక వెంటనే సరిహద్దుల వద్ద కాల్పులు మొదలుపెట్టింది. అంటే పాకిస్థాన్ యుద్ధం మొదలుపెట్టి అప్పుడే తొలి అడుగు కూడా వేసిందన్న మాట! కనుక భద్రతా దళాలు వారికి ధీటుగా జవాబు చెప్పక తప్పడం లేదు.
భారత్ తప్పకుండా ప్రతీకార దాడి చేస్తుందని, కనుక ధీటుగా ఎదుర్కొనేందుకు మనం కూడా సిద్దంగా ఉండాలని ఆ దేశ రక్షణమంత్రి ఖవాజా మహమ్మద్ ఆసీఫ్ అన్నారు.
తమ వద్ద 130 అణు బాంబులు సిద్దంగా ఉన్నాయని వాటిని భారత్ మీద ప్రయోగించడానికి వెనుకాడబోమని మరో పాక్ మంత్రి హనీఫ్ అబ్బాసీ హెచ్చరించారు. ప్రధాని మోడీ, రక్షణ మంత్రి రాజ్నాధ్ సింగ్ కూడా పాకిస్థాన్పై దాడి చేయబోతున్నట్లే మాట్లాడారు.
ఎప్పటికైనా పాక్ ఆక్రమిత కశ్మీర్ని స్వాధీనం చేసుకోవడమే తమ లక్ష్యమని అమిత్ షా ఇదివరకే చెప్పారు. కనుక భారత్ ముందుగా దానిపైనే దాడి చేసే అవకాశం ఉందని గట్టిగా నమ్ముతున్న పాకిస్థాన్, అక్కడి ఉగ్రవాద శిభిరాలను యుద్ధ ప్రాతిపదికన పాక్లోకి తరలించి సైన్యాన్ని, ఆయుధాలను అక్కడ మోహరిస్తున్నట్లు తెలుస్తోంది.
ఒకవేళ భారత్ అటువంటి ప్రయత్నం చేయకపోయినా ‘సింధూ నదీ జలాల విషయంలో రక్తం పారించేందుకు సిద్దంగా ఉన్నామని’ పాక్ పాలకులు బెదిరిస్తున్నందుకు లేదా దేశ ప్రజల ఆగ్రహం చల్లార్చేందుకు భారత్ ప్రతీకార చర్యలు చేపట్టడం ఖాయంగానే కనిపిస్తోంది.
భారత్-పాకిస్థాన్ మద్య చైనా అదృశ్యహస్తం కూడా ఉంటుంది. భారత్ని అది తమ శత్రువుగానే భావిస్తోంది.. పైగా వాణిజ్యం, పరిశ్రమలు, ఐటి రంగంలో చైనాకు భారత్ గట్టి పోటీనిస్తోంది.
కనుక తమ చేతికి మట్టి అంటకుండా భారత్ని దెబ్బ తీసేందుకు లభించిన ఈ అవకాశాన్ని చైనా సద్వినియోగం చేసుకొని పాకిస్థాన్కు అవసరమైన సాయం అందించడం ఖాయమే. ఈ నమ్మకం, ధైర్యంతోనే భారత్తో మరో యుద్ధం చేయాలని పాకిస్థాన్ తహతహలాడుతోందని భావించవచ్చు.
ఒకవేళ భారత్-పాక్ మద్య యుద్ధం మొదలైతే, అది వెంటనే ముగిసిపోకుండా రష్యా-ఉక్రెయిన్ యుద్దంలా సుదీర్గం సాగేలా చేసేందుకు చైనా తప్పక ప్రయత్నిస్తుంది. దాంతో భారత్ ఆర్ధిక, వాణిజ్య, పారిశ్రామిక వ్యవస్థలన్నీ కుప్పకూలిపోతే ప్పుడు ఆసియా ఖండంలో చైనాకు ఇక తిరుగు ఉండదు.
కానీ ఇది పూర్తిస్థాయి యుద్ధంగా మారకుండా భారత్ అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ, పాక్ ఆక్రమిత కశ్మీర్ని స్వాధీనం చేసుకోగలిగితే, ప్రధాని మోడీ పేరు ఎప్పటికీ చరిత్రలో నిలిచిపోతుంది. అలాగే యావత్ ప్రపంచదేశాలలో ఆయన పేరు, భారత్ పేరు మారుమ్రోగిపోతుంది.
కానీపూర్తిస్థాయి యుద్ధం జరిగితే దాని వలన కలిగే విధ్వంసానికి కూడా ప్రధాని మోడీనే అందరూ నిందిస్తా రు. భారత్ చరిత్రలో ప్రధాని మోడీ పేరు ఎర్రటి అక్షరాలతో అండర్ లైన్ చేసి లిఖించబడుతుంది. మోడీ ప్రభుత్వానికి ఇదంతా తెలుసు గనుకనే పాకిస్థాన్ ఎంత కవ్విస్తున్నా తొందరపడటం లేదు.






