రామచంద్రపురం టీడీపీ అభ్యర్థి సిట్టింగ్ ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు నాలుగుసార్లు గెలుపొంది ఐదోసారి గెలుపు కోసం మరోసారి బరిలో నిలిచారు. నియోజకవర్గంలో చేసిన తిరుగులేని అభివృద్ధే తనను గెలిపిస్తుందన్న ఆలోచనలో ఆయన ఉన్నారు. వైసీపీ అభ్యర్థి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ రాజోలుకు చెందిన వారు కావడంతో స్థానికత అంశం కూడా తనకు కలిసి వస్తుందని అనుకుంటున్నారు. జనసేన అభ్యర్థి పోలిశెట్టి చంద్రశేఖర్ కూడా స్థానికేతరుడే కావడం విశేషం.
కాపు సామాజికవర్గం అధికంగా ఉండడం, మిగిలిన సామాజికవర్గాలకు సమన్యాయం చేయడంతో ఆయన గెలుపు నల్లేరు మీద నడక అయ్యింది. అయితే ఈ సారి జనసేన పోటీ ఉండడం పైగా కాపు సామాజికవర్గానికే చెందిన వారికి టిక్కెట్ ఇవ్వడంతో పరిణామాలు ఆసక్తికరంగా మారాయి. కాపులతో పాటు సమానంగా ఉన్న శెట్టిబలిజ కులానికి చెందిన వ్యక్తికీ వైఎస్సార్ కాంగ్రెస్ టిక్కెట్ ఇచ్చింది. దీనితో ఈ సారి పోటీ రసవత్తరంగా మారింది. ఇక్కడ ఫలితం ఎలా ఉండబోతుంది అనేదాని మీద జిల్లా వ్యాప్తంగా చర్చ జరుగుతుంది.
ఇందులో ఇంకో విశేషం ఏమిటంటే తోట త్రిమూర్తులు పార్టీ మారతారని నియోజకవర్గంలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ముందు ఆయన జనసేనలో చేరతారని వార్తలు వచ్చాయి. పవన్ కళ్యాణ్ కూడా రామచంద్రపురం పర్యటనకు వచ్చినప్పుడు తోట మీద ఎటువంటి విమర్శలు చెయ్యలేదు. ఆ తరువాత ఆయన వైఎస్సార్ కాంగ్రెస్ లో చేరిపోనున్నారు అనే వదంతులూ వినపడ్డాయి. అయితే చివరి నిముషంలో ఆయనకు జగన్ కు పొసగలేదని సమాచారం. దీనితో ఆయన టీడీపీ తరపునే పోటీ చేస్తున్నారు.



