ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇతర రాష్ట్రాలలో ఎక్కడ లేని విధంగా రాష్ట్ర రాజధాని మీద రాజకీయాలు నడుస్తుంటాయి. తెలంగాణ రాజధాని హైద్రాబాద్ చిన్న పాటి వర్షానికి సైతం చిగురుటాకులా వణుకుతుంది, అక్కడి జనజీవనాన్ని అస్తవ్యస్తం చేస్తుంది.
ఇక ఏపీకి మరో పొరుగు రాష్ట్రమైన తమిళనాడు విషయానికొస్తే, ఆ రాష్ట్ర రాజధాని సముద్రతీరమైన చెన్నై.వాయుగుండాలు, అల్పపీడనాలతో చెన్నై నగరం కూడా ఎప్పుడు అనేక ఆటుపోట్లను ఎదుర్కొంటూనే ఉంటుంది. అలాగే దేశ ఆర్థిక రాజధాని ముంబై, కర్ణాటక రాజధాని బెంగళూర్ ఇలా పారిశ్రామికంగా, ఆర్థికంగా నిలదొక్కుకున్న రాష్ట్ర రాజధానులు సైతం వర్ష భీభత్సం ముందు తలవంచక తప్పదు.
అలాగే దేశ రాజధాని ఢిల్లీ ఏకంగా కాలుష్య కోరలలో చిక్కుకుని అక్కడి ప్రజలనే కాదు ప్రభుత్వాన్ని సైతం ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. ఇలా దేశంలో ప్రతి రాష్ట్రానికి, ఆ రాష్ట్ర రాజధానికి అక్కడి భౌగోళిక పరిస్థితుల దృష్ట్యా, పెరిగిన జనాభా ప్రాతిపదిక దృష్ట్యా ఎదో రకమైన సమస్య వెంటాడుతూనే ఉంటాయి.
అయితే ఆ రాష్ట్రాలలో ఎక్కడ వినిపించని, కనిపించని సమస్య ఒక్క ఆంధ్రప్రదేశ్ లో మాత్రమే దర్శనమిస్తుంది..వై..? వైసీపీ అధికారంలో ఉంటే మూడు రాజధానుల పేరుతో రాష్ట్ర రాజధాని అమరావతిని ఒక అరణ్యంలా మార్చేసి పాడుబెట్టేసింది. అదే వైసీపీ ప్రతిపక్షంలో రాగానే అమరావతి ఒక ముంపు ప్రాంతం, ఈ ప్రాంతం నిర్మాణాలకు అనువైన ప్రదేశం కాదు, ప్రభుత్వానికి సహకరించకండి అంటూ అక్కడి రైతులను రెచ్చకొట్టడం,
రాజధాని నిర్మాణం కోసం ఇన్ని వేల ఎకరాల భూ సేకరణ అవసరమా.? రాజధాని కట్టడాలకు వేల కోట్లు సమంజసమా.? అంటూ రాష్ట్ర రాజధాని మీద రాజకీయం చేయడం ఒక్క వైసీపీ కే చెల్లిందని చెప్పాలి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో విడిపోయి ఇప్పటికి 11 వసంతాలు పూర్తి చేసుకున్నప్పటికీ ఇంకా అమరావతి మొడుబారిన చెట్టు మాదిరి వసంతకాలం కోసం ఎదురు చూస్తూనే ఉంది.
ఇన్ని వేల ఎకరాలు అవసరమా అంటూ ఒకరు, ఇంత పాటి ఖర్చు భరించగలమా అంటూ మరొకరు, ఎప్పుడు మొదలు పెడతారు, ఎప్పటికి పూర్తి చేస్తారు, అసలు ఇది అమరావతా లేక భ్రమరావతా.? రాజధాని కాదు గ్రాఫిక్స్ మాయాజాలం, ఇది ప్రజా రాజధాని కాదు కమ్మ వారి కలల సౌధం అంటూ…..ఇలా ఏపీ రాజధాని అమరావతి పై నిత్యం ఎదో ఒక విష ప్రచారం జరుగుతూనే ఉంటుంది.
అసలు రాజధాని నిర్మాణం అంటే అదేదో సామాన్య ప్రజలకు అర్ధం కానీ ‘బ్రహ్మ పదార్ధం’ మాదిరి మార్చేశారు ఇక్కడి రాజకీయ ముసుగులో ఉన్న కొంతమంది రాక్షసవాదులు. మే 2 న దేశ ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా మరోసారి పునర్నిర్మాణానికి సిద్దమైన అమరావతి కి ఇకనైనా ఈ ‘రాజకీయం’ అనే గ్రహణం, ‘వైసీపీ’ అనే చీకటి నుంచి విముక్తి కలుగుతుందో లేదో చూడాలి.




