వైసీపీ పార్టీకి ఊహించని షాక్ ఇచ్చిన మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణ రెడ్డి దెబ్బకు బ్లూ మీడియా ఒక్కొక్కటిగా నిజాలు బయటపెడుతోంది. చంద్రబాబు కొడుకు లోకేష్ మీద ఘన విజయం సాధించిన ఆళ్ల రామకృష్ణ రెడ్డి. ఆర్కే దెబ్బకు లోకేష్ అవుట్.రాజధాని ప్రాంతంలోనే టీడీపీ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ. అంటూ వైసీపీ పార్టీని, పార్టీ తరుపున నిలబడి గెలిచిన ఆర్కేను ఆకాశానికెత్తేసిన బ్లూ మీడియా ఇప్పుడు పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసి 24 గంటలు గడవక ముందే పాతాళానికి తొక్కడానికి కథనాలు రెడీ చేస్తుంది.
వైసీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పటి నుంచి టీడీపీ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టడానికి, చంద్రబాబు మీద కేసులు వేయడానికి మధ్య వారధిగా పనిచేసి వైసీపీ అధిష్టాన మన్ననలు, బ్లూ మీడియా అనుకూల ప్రచారాలతో ఆర్కే మంగళగిరి తన అడ్డాగా భావించారు. తాజా పరిణామాలతో ఒక్కసారిగా స్థానిక రాజకీయ వాతావరణం మారిపోవడంతో తన అంచనాలు తలకిందులయ్యాయని భావించిన ఆర్కే వైసీపీ పార్టీ పైన కానీ పార్టీ అధిష్టానం మీద కానీ ఎటువంటి విమర్శలు చేయకుండా పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు.
అయినా నిన్ను వదిలేదె లేదు అన్నట్టుగా వైసీపీ అనుకూల మీడియాలో ఆర్కేకు వ్యతిరేకంగా కథనాలు ప్రచారం చేస్తున్నారు. అయితే ఈ కథనాలతో అసలు నిజాలు బయటకొస్తున్నాయి అంటూ అనందం వ్యక్తం చేస్తున్నారు టీడీపీ శ్రేణులు. గత ఎన్నికలలో లోకేష్ మీద ఆర్కే గెలిచింది స్థానిక ప్రాంతంలో ఆర్కే కు మంచి పట్టు ఉండడం కాదని, అలాగే జగన్ ప్రభావం కాదని కేవలం సింపతీ మీదనే గెలుపు జెండా ఎగరేశారంటూ వార్తలు రావడం మొదలుపెట్టింది.
మంగళగిరి నియోజకవర్గం నుండి ఇవే నా చివరి ఎన్నికలు అంటూ ప్రచారం చేయడంతో ప్రజలు జాలిపడి, సింపతీ కలిగి ఆర్కే కు ఓటువేశారే కానీ ఆళ్ల మీద నమ్మకముతోనో, జగన్ పట్ల విశ్వాసంతోనో, అలాగే లోకేష్ పై వ్యతిరేకతతోను కాదని ప్రజలకు స్పష్టం చేశారు. అలాగే మంగళగిరి బీసీ లకు పట్టున్న ప్రాంతమని, ఇక్కడ బీసీలకే సీట్లు కేటాయించాలని బీసీ భజన మొదలుపెట్టారు.
మరి గడిచిన పదేళ్లలో ఇది బీసీ కాన్స్టెన్సీ అన్న విషయం జగన్ మరిచిపోయారా..?లేక ప్రజలను ఏమార్చరా..? ఇప్పుడు బీసీ అంటూ భజన చేయడం వెనుక వైసీపీ అంతర్యం ఏమై ఉంటుంది..?అంటూ స్థానికంగా పలు ప్రశ్నలు తలెత్తుతున్నాయి.అయితే వైసీపీ పార్టీని భుజాన మోయడానికి సిద్ధపడ్డ బ్లూ మీడియా ఆర్కేను ఏకిపారేయాలనే ఉద్దేశంతో అసలు నిజాలు ప్రజల ముందు ఉంచడం కూడా ఒకరకంగా ప్రజలకు మంచి చేసినట్టే.
ఇవే నా చివరి ఎన్నికలు అని ప్రచారం చేసినందున మరో సారి పోటీ చేయకూడదు, అది న్యాయం కాదు అంటూ ఆర్కేకు ధర్మ పాటలు వల్లిస్తున్న వారు గత ఎన్నికలలో జగన్ ఏపీ ప్రజలను ఒక్క ఛాన్స్ అంటూ వేడుకున్నారు. ప్రజలు కూడా జాలిపడో, సింపతీ వచ్చో జగన్ కు ఒక్క అవకాశం కల్పించారా…? ఇప్పుడు జగన్ అడిగిన ఒక ఛాన్స్ అయ్యిపోయింది కాబట్టి మరో ఛాన్స్ అడగకూడని కూడా జగన్ కు చెప్పగలరా..? అనే సామాన్యుడి ప్రశ్నలకు కూడా బ్లూ మీడియా సమాధానము చెప్పగలిగితే బాగుంటుందని ఆశపడుతున్నారు.




