కడప లోక్సభ ఎన్నికలలో వైసీపి అభ్యర్ధిగా పోటీ చేస్తున్న అవినాష్ రెడ్డి బయట వారితో పోటీ పడాల్సివస్తే ఎటువంటి ఇబ్బంది ఉండేది కాదు. ఏదోవిదంగా నెగ్గేవారు. కానీ ఒకేసారి ఇద్దరు సోదరిలను ఎదుర్కోవలసి రావడమే చాలా ఇబ్బందిగా మారింది.
వారిరువురూ తమ ఎన్నికల ప్రచారంలో వివేకా హత్య గురించే ప్రధానంగా ప్రస్తావిస్తూ నిలదీస్తుండటంతో అవినాష్ రెడ్డికి జవాబు చెప్పుకోలేకపోతున్నారు. ఇదీగాక ఆమె జగన్ సొంత చెల్లెలు కావడంతో తనను కాదని హత్యారోపణలు ఎదుర్కొంటున్న అవినాష్ రెడ్డిని జగన్ ఎందుకు వెనకేసుకువస్తున్నారనే ఆమె ప్రశ్న కడప ప్రజలను ఆలోచింపజేస్తోంది.
ఇంతకాలం అవినాష్ రెడ్డిని కడప ప్రజలు చూశారు కనుక ఈసారి వైఎస్ షర్మిలకు ఒక ఛాన్స్ ఇద్దామని వారు అనుకుంటున్నట్లు ‘మౌత్ టాక్’ వినిపిస్తోంది.
గతంలో చంద్రబాబు నాయుడు ఏపీ ముఖ్యమంత్రిగా, తెలంగాణలో కేసీఆర్ ఉన్నప్పుడూ ప్రజలు ఇలాగే ఆలోచించి జగన్, రేవంత్ రెడ్డిలకు ఒక ఛాన్స్ ఇచ్చారు. కనుక కడపలో కూడా ఇటువంటి అవకాశం తప్పక ఉంటుంది.
వైఎస్ షర్మిల బరిలో దిగే వరకు కడపలో ఎవరికీ అసలు ఇలాంటి ఆలోచనే కలగలేదు. కానీ ఇప్పుడు కలిగింది. కలిగించేలా ఆమె చేయగలిగారు. అంటే సగం విజయం సాధించిన్నట్లే భావించవచ్చు.
కడప ప్రజలు ఎవరివైపు మొగ్గుతారు అనే చర్చను కాసేపు పక్కన పెట్టి, ఒకవేళ అవినాష్ రెడ్డి ఓడిపోతే ఆ ప్రభావం జగన్పై ఏ మేరకు ఉంటుందని ఆలోచిస్తే అది నూటికి నూరు శాతం జగన్ ఓటమిగానే పరిగణింపబడుతుంది.
ఉదాహరణకు తెలంగాణలోని హుజూరాబాద్ ఉప ఎన్నికలలో ఈటల రాజేందర్ని ఓడించేందుకు కేసీఆర్ సర్వశక్తులు ఒడ్డి పోరాడారు. కానీ బిఆర్ఎస్ అభ్యర్ధి ఓడిపోవడంతో అది కేసీఆర్ ఓటమిగానే అందరూ పరిగణించారు.
అదే విదంగా కడప కంచుకోటలో అవినాష్ రెడ్డి ఓటమి అంటే జగన్ ఓటమిగానే పరిగణింపబడుతుంది. అది కడప ప్రజల ఆలోచనలో మార్పు వచ్చిందని అది సూచిస్తుంది.
అయితే అవినాష్ రెడ్డి ఓటమితో ఈ కధ ముగిసిపోతుందా? అంటే కాదనే భావించవచ్చు. ఆయన ఎంపీగా ఉన్నారు. ముఖ్యమంత్రి జగన్ పూర్తి మద్దతు కూడా ఉంది. కనుకనే సీబీఐ ఆయనను తాకలేకపోతోందనేది అందరికీ తెలిసిన రహస్యం.
ఒకవేళ ఆయన ఓడిపోతే ప్రజలు కూడా వైఎస్ షర్మిల వాదనలతో ఏకీభవించిన్నట్లవుతుంది. కనుక జగన్ ఆయనను ఇక వెనకేసుకు రాలేకపోవచ్చు. అయినా జగన్ ఆయనకు అండగా నిలబడవచ్చు. కానీ సీబీఐ మాత్రం అవినాష్ రెడ్డిని విడిచి పెట్టకపోవచ్చు.
ఒకవేళ ఏపీలో వైసీపి కూడా ఓడిపోతే సీబీఐ మరింత చురుకుగా పావులు కదిపి అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి ప్రయత్నించవచ్చు. అరెస్ట్ చేస్తే తర్వాత ఏం జరుగుతుందో తెలియనివారికి వైఎస్ షర్మిల, సునీతలు ఎలాగూ చెపుతారు.
కనుక కడపలో ఎట్టి పరిస్థితులలో అవినాష్ రెడ్డిని, ఏపీలో వైసీపిని గెలిపించుకోవలసిన పూర్తి బాధ్యత జగన్మోహన్ రెడ్డిదే అనుకోవచ్చు లేకుంటే ‘క్రోధీ నామ’ ప్రభావం వెంటనే మొదలైపోతుంది.




