ఏపీ సిఎం జగన్మోహన్ రెడ్డి దంపతులు త్వరలో విదేశాలకు వెళ్ళేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు సమాచారం. అక్రమస్తుల కేసులలో జగన్మోహన్ రెడ్డికి సీబీఐ న్యాయస్థానం షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసినందున, విదేశాలు వెళ్ళేందుకు అనుమతి కోరుతూ సిఎం జగన్మోహన్ రెడ్డి హైదరాబాద్లోని నాంపల్లి సీబీఐ న్యాయస్థానానికి దరఖాస్తు చేసుకున్నట్లు తెలుస్తోంది.
జగన్ దంపతుల ఇద్దరు కుమార్తెలలో ఒకరు లండన్లో మరొకరు అమెరికాలో చదువుకుంటున్నారు. కనుక మే 13న ఏపీ శాసనసభ, లోక్సభ ఎన్నికల పోలింగ్ ముగిసిన మర్నాడే లండన్లో కూతురు వద్దకు వెళ్ళేందుకు ఏర్పాట్లు చేసుకొంటున్నట్లు తెలుస్తోంది. కోర్టు అనుమతితో ఈ నెల 14 నుంచి 30వ తేదీ వరకు వారు విదేశాలలో తమ కుమార్తెలతో గడిపి రావాలనుకుంటున్నట్లు తెలుస్తోంది.
ఇదివరకు కూడా వారివురూ విదేశాలలోని తమ కుమార్తెల వద్దకు వెళ్ళి వచ్చారు. కానీ అప్పుడు పరిస్థితులు వేరు. ఇప్పుడు పరిస్థితులు వేరు.
ఇప్పుడు కీలకమైన శాసనసభ, లోక్సభ ఎన్నికలు జరుగుతున్నాయి. పోలింగ్ ఇంకా మొదలవక ముందే జగన్ దంపతులు విదేశాలకు బయలుదేరుతుండటం నిజమే అయితే అది ప్రజలకు ముఖ్యంగా వైసీపి శ్రేణులకు తప్పుడు సంకేతాలు పంపినట్లవుతుంది.
ఇక మరో విషయం ఏమిటంటే, ఈరోజే జగన్ సోదరి వైఎస్ షర్మిల, “కడపలో అవినాష్ రెడ్డి ఓడిపోతే విదేశాలకు పారిపోయేందుకు పాస్ పోర్ట్ వగైరా సిద్దం చేసుకుంటున్నారు,” అని అన్నారు. ఆమె మాటలలో నిజానిజాలు ఎలా ఉన్నా ప్రజలు వాటినే నమ్ముతారు.
అవినాష్ రెడ్డి గురించి వైఎస్ షర్మిల ఈ వ్యాఖ్యలు చేసిన రోజే జగన్ దంపతులు విదేశీ యాత్ర వార్త రావడం యాదృచ్చికమే కావచ్చు కానీ ప్రజలు జగన్ దంపతుల విదేశీ యాత్రని కూడా షర్మిల వ్యాఖ్యలను అన్వయించే చూస్తారు కదా?
“ఈసారి ఎన్నికలు సక్రమంగా జరుగుతాయనే నమ్మకం రోజు రోజుకీ సన్నగిల్లిపోతోందంటూ,” జగన్మోహన్ రెడ్డి ఇటీవల చేసిన వ్యాఖ్యలతో వైసీపి శ్రేణులు తీవ్ర ఆందోళన చెందుతున్నాయి. అది ఓటమిని అంగీకరించిన్నట్లే అని టిడిపి, జనసేన, బీజేపీలు వాదిస్తున్నాయి.
ఇప్పుడు జగన్ దంపతులు కేవలం తమ కుమార్తెలతో కొన్ని రోజులు గడిపి వచ్చేందుకే విదేశాలకు వెళ్ళాలని భావిస్తున్నప్పటికీ, ‘ఎన్నికలలో ఓడిపోతే ఆంధ్రాలో ఉండలేమనే భయంతోనే జగన్ ఇప్పుడే మూటాముల్లె సర్ధేసుకొని విదేశాలకు పారిపోతున్నారని’ టిడిపి, జనసేన, బీజేపీలు ప్రచారం చేయకుండా ఉండవు. అదే కనుక జరిగితే వైసీపి ఓటమిని ఇక ఎవరూ ఆపలేరని వేరే చెప్పక్కరలేదు.
కనుక కనీసం పోలింగ్ పూర్తయ్యేవరకు ఈ విషయం బయటకు పొక్కకుండా జాగ్రత్త పడి ఉంటే బాగుండేదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.




