విశాఖ ప్రజలకు ఆడుదాం ఆంధ్రా… టీజర్‌ మాత్రమే!

YS Jagan Aadudam Andhra Vizag Traffic Jam

ఇటీవల వైసీపి అధినేత జగన్మోహన్‌ రెడ్డికి హటాత్తుగా సినిమాలు, హిందూ పురాణాలు, క్రీడలపై ఆసక్తి పెరిగిపోయింది. అందుకే వ్యూహం యాత్ర-2, శపధం సినిమాలు స్పాన్సర్ చేశారు. కురుక్షేత్రం, పద్మవ్యూహం, శ్రీకృష్ణుడు, అర్జునుడు అంటూ మాట్లాడుతున్నారు. ఆడుదాం ఆంధ్రా అంటూ హడావుడి చేస్తున్నారు.

నిన్న సాయంత్రం విశాఖలోని మధురవాడ సమీపంలో వైఎస్సార్ స్టేడియంలో ‘ఆడుదాం ఆంధ్రా’ కార్యక్రమానికి జగన్మోహన్‌ రెడ్డి, మంత్రులు, వంధీమాగాధులు తరలివచ్చారు. ముఖ్యమంత్రి పర్యటనకు వస్తుండటంతో నిన్న ఉదయం నుంచే భారీగా పోలీసులను మోహరించి వాహనాల రాకపోకలను నియంత్రించడం మొదలుపెట్టారు.

ADVERTISEMENT

ఈ కార్యక్రమం జరిగిన స్టేడియం హైవే రోడ్డు పక్కనే ఉంది. ఇటు హైదరాబాద్‌ నుంచి అటు రాయ్‌పూర్, ఒడిశా వంటి ఇతర రాష్ట్రాల నుంచి, అదేవిదంగా ఇటు శ్రీకాకుళం, విజయనగరం నుంచి అటు విజయవాడ, రాజమండ్రిల నుంచి వచ్చిపోయే బస్సులు, రవాణా వాహనాలతో నిత్యం ఆ హైవే రోడ్డు చాలా రద్దీగా ఉంటుంది.

రెండు నిమిషాలు ట్రాఫిక్ సిగ్నల్ పడితేనే అర కిలోమీటర్ పొడవునా వాహనాలు నిలిపోతుంటాయి. అలాంటిది సుమారు మూడు నాలుగు గంటలు వాహనాలను నియంత్రించడంతో రెండు వైపులా కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి.

ఇది చాలదన్నట్లు ఈ కార్యక్రమానికి చుట్టుపక్కల జిల్లాలు, ప్రాంతాల నుంచి జనాలను తీసుకు వచ్చేందుకు వందల కొద్దీ ఆర్టీసీ బస్సులను తీసుకోవడంతో, ఆ బస్సులతో స్టేడియం చుట్టుపక్కల ప్రాంతాలన్నీ నిండిపోయాయి. సాయంత్రం చాలా రద్దీగా ఉండే వేళ ఒకేసారి వందల బస్సులు మాయం అయిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పిల్లికి చెలగాటం ఎలక్కి ప్రాణసంకటం అంటే ఇదేనేమో?

వైసీపి భాషలో చెప్పుకోవాలంటే ఇది ట్రైలర్‌ కూడా కాదు కేవలం టీజర్‌ మాత్రమే. టీజర్‌ ఇంత భయంకరంగా ఉంటే, ఒకవేళ నిజంగానే విశాఖ రాజధానిగా చేసేసి, జగన్మోహన్‌ రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలు, వేలాదిమంది అధికారులు, ఉద్యోగులు, వారి కుటుంబాలు, వాహనాలతో దిగిపోతే విశాఖ నగరం పరిస్థితి ఏమిటి?ఈ చిన్న టీజర్‌ చూస్తేనే వణుకు పుడుతుంది. ఇక పూర్తి సినిమా చూపిస్తే విశాఖ నగర ప్రజలు తట్టుకోగలరా?భరించగలరా?

ADVERTISEMENT
Latest Stories