వైసీపి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వర్తమానం, భవిష్యత్ గురించి ఆలోచించి ఉంటే, ముందుగా రాజధాని, పోలవరం ప్రాజెక్టులను యుద్ధ ప్రాతిపదికన పూర్తిచేసి ఉండేది. రాష్ట్రంలో మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేసి ఉండేది. పరిశ్రమలు, ఐటి కంపెనీలను రప్పించి యువతకు ఉద్యోగాలు ఉపాధి కల్పించి ఉండేది.
వీటన్నిటిపై వైసీపి ప్రభుత్వానికి శ్రద్ద, నిబద్దత, దూరదృష్టిలేకపోయినా అధికారంలోకి వచ్చినప్పుడే 5 ఏళ్ల తర్వాత 2024లో జరుగబోయే ఎన్నికలకి వైసీపి ఓటు బ్యాంక్ పెంచుకొనేందుకు ఏమేమి చేయాలో చాలా దూరదృష్టితో ఆలోచించడం విశేషం. ఆ ప్రయత్నాలలో భాగంగానే సంక్షేమ పధకాల పేరుతో లక్షల కోట్లు పంచిపెడుతుండటం అందరూ చూస్తూనే ఉన్నారు.
సకాలంలో జీతాలు చెల్లించాలాని ఉద్యోగులు, ఉపాధ్యాయులు కోరుతున్నారు. సకాలంలో బకాయి బిల్లులు చెల్లించాలని కాంట్రాక్టర్లు, ఆరోగ్యశ్రీ ఆస్పత్రులు కోరుతున్నాయి. ఉద్యోగాల భర్తీకి జాబ్ క్యాలండర్ ప్రకటించాలని, నిరుద్యోగ భృతి చెల్లించాలని నిరుద్యోగులు కోరుతున్నారు. కానీ జాబ్ క్యాలండర్ ప్రకటించకపోయినా సంక్షేమ పధకాల అమలుకి క్యాలండర్ ప్రకటించి అప్పోసొప్పో చేసి టంచనుగా అమలుచేస్తుండటం అందరూ చూస్తూనే ఉన్నారు.
మళ్ళీ వాటిలో కూడా వైసీపి ప్రభుత్వం చాలా దూరదృష్టితో ఆలోచించి వ్యవహరించడం ఇంకా విశేషం. ఏపీ శాసనసభ, లోక్సభ ఎన్నికలు 2024, మార్చి-ఏప్రిల్ నెలల్లో జరుగుతాయని ముందే తెలుసు. కనుక ఆ లెక్కనే పింఛన్ల పెంపు షెడ్యూల్ ముందే తయారుచేసుకొని అమలుచేస్తూ, ఎన్నికలకు ముందు అంటే… వచ్చేనెల (జనవరి) నుంచి చివరి విడత పింఛన్ల పెంపుని అమలుచేస్తూ రూ.2,750 నుంచి రూ.3,000కి పెంచింది.
జనవరి నుంచి పింఛన్లు పెంచుతున్నట్లు వైసీపి ప్రభుత్వం ప్రకటించింది. తద్వారా పింఛన్ పొందుతున్న వారందరూ వైసీపికే ఓట్లు వేసేలా ముందే జాగ్రత్తపడింది.
తమ ఓటు బ్యాంక్ విషయంలో ఇంత దూరదృష్టితో వ్యవహరిస్తున్న వైసీపి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి విషయంలో కూడా చూపించి ఉంటే ప్రజలు మళ్ళీ దానినే గెలిపించి ఉండేవారు కదా? కానీ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం కంటే సంక్షేమ పధకాల పేరుతో డబ్బు పంచుతూ ఓటర్లను ప్రలోభపెట్టి లొంగదీసుకొని మళ్ళీ అధికారంలోకి రావడమే సులువని భావించడం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, ప్రజల దౌర్భాగ్యం కాకపోతే మారేమిటి?




