చాలా కాలం తర్వాత ఢిల్లీ సర్కిల్స్ లో మళ్ళీ వినపడుతోన్న మాట… వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి అరెస్ట్ కు రంగం సిద్ధమవుతోందని! ఇటీవల కాలంలో జగన్ కు సంబంధించిన అక్రమాస్తుల కేసులలో ఈడీ పలు దఫాలుగా కొన్ని కోట్ల రూపాయల విలువను అటాచ్ చేసిన విషయం తెలిసిందే. అయితే తన ఆస్తులను జప్తు చేయకుండా కోర్టు నుండి జగన్ స్టే తెచ్చుకోవడంతో, మారిషస్ నుండి వచ్చిన నిధులపై వ్యక్తిగతంగా విచారణ చేసేందుకు రంగం సిద్ధమైంది.
ఈ నెల 23వ తేదీన జగన్ ను విచారణ చేయనున్నారని, ఈ విచారణలో భాగంగా సంతృప్తికరమైన సమాధానాలు లభించని పక్షంలో జగన్ ను అరెస్ట్ చేసినా ఆశ్చర్యం లేదని జాతీయ స్థాయి రాజకీయాల్లో వినపడుతున్న మాటలు. ఇదిలా ఉంటే… జగన్ అక్రమాస్తుల కేసుల విచారణ నత్తనడకపై ఇటీవల తెలుగుదేశం పార్టీ వెలిబుచ్చిన అభ్యంతరాల ఫలితాలే ఇవని, వీటి నుండి జగన్ బయటపడతారని వైసీపీ వర్గాలు అంటున్నాయి. కొత్త ఏడాది తొలి మాసంలోనే వైసీపీకి అగ్ని పరీక్ష ఎదురు కాబోతుందని పొలిటికల్ వర్గాలు పేర్కొంటున్నాయి.



