‘ఆ ఒక్కటీ అడక్కు’ సినిమాలో ఓ జ్యోతిష్కుడు చెప్పిన మాటలకు పడిపోయి ‘రాబోయే కాలానికి కాబోయే కింగ్ నేనే’ అంటూ రాజేంద్రప్రసాద్ వెండితెరపై పండించిన హాస్యానికి ఇప్పటికీ ప్రేక్షకులు ముగ్దులవుతున్నారు. అయితే పొలిటికల్ తెరపై వైఎస్ జగన్ ఈ బాధ్యతలు తీసుకున్న విషయం తెలిసిందే. రెండేళ్ళల్లో ఈ ప్రభుత్వం పడిపోతోంది… ఆ తర్వాత ఎన్నికలు వస్తాయి… అప్పుడు మనదే రాజ్యం అంటూ చెప్పుకుంటూ వస్తున్న జగన్ కు మంచి రోజులు పక్కన పెడితే… మరీ గడ్డు పరిస్థితులు ఎదురవుతుండడం విశేషం.
ముఖ్యంగా ఊహించని విధంగా ఈడీ ప్రకటించిన 750 కోట్ల విలువైన ఆస్తుల అటాచ్ మెంట్ విషయంతో కలత చెందిన జగన్ తన ఇంటికి జ్యోతిష్కులను పిలిపించుకున్నట్లుగా సమాచారం. గడచిన ఎన్నికల్లో ఓటమి తర్వాత జ్యోతిష్కులతో భవిష్యత్తు చెప్పించుకున్న జగన్… గురువారం నాడు తన లోటస్ పాండ్ నివాసానికి జ్యోతిష్కులను రప్పించుకుని, వారితో దాదాపుగా 3 గంటల పాటు తన భవిష్యత్తుపై మంతనాలు జరిపారట. ఈ కష్టాల నుంచి గట్టెక్కాలంటే కొన్ని దోష నివారణ చర్యలు చేపట్టక తప్పదని జ్యోతిష్కులు సూచించినట్లు వార్తలు వినవస్తున్నాయి.
జ్యోతిష్కులతో మంతనాల నేపథ్యంలో తనను కలిసేందుకు వచ్చిన ఏ ఒక్క ఎమ్మెల్యేకు కూడా జగన్ అపాయింట్ మెంట్ ఇవ్వలేదట. ఇదిలా ఉంటే, ఆస్తులను అటాచ్ చేసిన ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు గురువారం నాడు వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇంటికి వెళ్లి, అటాచ్ మెంట్ కు సంబంధించిన నోటీసులను వారు స్వయంగా జగన్ కు అందజేసినట్లు సమాచారం.



