కోడి కత్తి దాడి జరిగిన ఘటనలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ధరించిన చొక్కా ఎట్టకేలకు కోర్టుకు చేరింది. రక్తపు మరకలతో ఉన్న ఆ చొక్కాను ఈ నెల 23న అందజేయాలని గతంలోనే న్యాయస్థానం ఆదేశించింది. దీంతో హైదరాబాద్ నుంచి వచ్చిన జగన్ తరఫున న్యాయవాది కె.చిన్నారెడ్డి దానిని శుక్రవారం కోర్టుకు సమర్పించారు. అయితే ఈ కేసును విచారిస్తున్న సిట్ పై తమకు నమ్మకం లేదనీ హైకోర్టులో తాము వేసిన రిట్ పిటిషన్పై విచారణ ముగిసే వరకూ సీల్డ్ కవరులోనే ఉంచాలని అభ్యర్థించారు.
[m9ad]
మొదటి నుండి ఎందుకనో ఈ చొక్కాను ఇవ్వడానికి జగన్ ఇష్టపడలేదు. ఇక కోర్టు తప్పక అందజేయాలని చెప్పడంతో ఇక ఆయన ఇవ్వక తప్పలేదు. ఆ చొక్కా పై జగన్ అంత మమకారం ఎందుకని సోషల్ మీడియా లో జోకులు పేలుతున్నాయి. అయితే దీనికి బలమైన కారణముందని వైకాపా వారు అంటున్నారు. చొక్కా ఏపీ పోలీసులకు ఇస్తే సాక్షాధారాలు తారుమారు చేస్తారని జగన్ భయం ఒక వేళ హై కోర్టు ప్రమేయంతో సిబిఐ గానీ ఏదేని కేంద్ర దర్యాప్తు సంస్థకు గానీ ఈ కేసును అప్పగిస్తే ఈ చొక్కా వారికి అందించాలని జగన్ వ్యూహం.
మరోవైపు విశాఖపట్నం విమానాశ్రయంలో తనపై జరిగిన హత్యాయత్నం ఘటన పౌర విమానయాన భద్రతా చట్టం పరిధిలోకి వస్తుందని, అందువల్ల ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు జరిపేలా కేంద్ర హోంశాఖను ఆదేశించాలని జగన్మోహన్రెడ్డి హైకోర్టుకు విజ్ఞప్తి చేస్తూ అదనపు పిటిషన్ వేశారు. ఈ హత్యాయత్నం ఘటన తాలూకు పూర్తి సమాచారాన్ని, నివేదికను రాష్ట్ర పోలీసులు కేంద్ర హోంశాఖకు పంపాల్సి ఉన్నా, ఇప్పటివరకూ పంపలేదని న్యాయస్థానానికి నివేదించారు. అందువల్ల సంబంధిత నివేదికను, సమాచారాన్ని వెంటనే కేంద్రానికి పంపేలా రాష్ట్ర హోంశాఖ ముఖ్య కార్యదర్శి, డీజీపీ, ఎయిర్పోర్ట్ విమానాశ్రయ ఎస్హెచ్ఓలను ఆదేశించాలని హైకోర్టును అభ్యర్థించారు.



