‘జగన్’ బదులు ‘ముద్రగడ’ వచ్చారేంటి!

ys jagan behind Mudragada Padmanabham నంద్యాల ఉప ఎన్నికల ఓటమిని అంగీకరిస్తూ వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి మీడియా ముందుకు వచ్చి పార్టీ పరంగా తమ అభిప్రాయం చెప్తారని పొలిటికల్ వర్గాలు ఎదురు చూస్తున్న తరుణంలో… జగన్ కంటే ముందుగా ముద్రగడ పద్మనాభం మీడియా ముందుకు వచ్చారు. నంద్యాల ఫలితం నేపధ్యంలో… బహుశా జగన్ బదులు తాను వచ్చానన్న సమాచారం పరోక్షంగా ప్రజలకు ఇవ్వాలని భావించారో ఏమో గానీ, ఓ పక్కన మీడియా వర్గాలన్నీ ఉప ఎన్నికల ఫలితాలను ప్రసారం చేస్తుంటే, కేవలం జగన్ మీడియా ఛానల్ సాక్షిలో మాత్రం ముద్రగడ పద్మనాభం ప్రత్యక్షమయ్యారు.

నంద్యాల ఉప ఎన్నికల వరకు ఎలాగైతే చంద్రబాబు పైన జగన్ విరుచుకుపడ్డారో, అదే విధంగా ముద్రగడ తాజాగా వ్యాఖ్యానించారు. ఇందులో కొత్తేమీ లేదు. అయితే ముద్రగడ మీడియా ముందుకు వచ్చిన సందర్భం మాత్రం హైలైట్ అవుతోంది. ఓ పక్కన టిడిపి వర్గీయులంతా సంబరాలు చేసుకుంటుంటే, వారిని వేలెత్తి చూపించడానికి జగన్ బదులు తాను ఉన్నాననే భావన వచ్చే విధంగా ప్రసంగం ఉండడం గమనించదగ్గ విషయం. నిజానికి ఈ విషయం తెలుగుదేశం పార్టీ ఎప్పటి నుండో చెప్తూ వస్తోంది. ముద్రగడ వెనుక ఉండి ఆడిస్తోంది వైఎస్ జగన్ మోహన్ రెడ్డేనని టిడిపి చేస్తోన్న ఆరోపణలకు బలం చేకూరినట్లయ్యింది.

ADVERTISEMENT

అయితే ముద్రగడ వ్యాఖ్యలను ఒక్క జగన్ మీడియా ఛానల్ సాక్షి తప్ప, మరో మీడియా ఏది కూడా పట్టించుకోకపోవడం విశేషం. ఈ అంశం కూడా అత్యంత కీలకమనే చెప్పవచ్చు. సాక్షి మాత్రమే ముద్రగడ ప్రసంగాన్ని ఎందుకు ప్రసారం చేసింది అంటే… నంద్యాల ఫలితాల సరళి చూడగానే హడావుడిగా ఈ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లుగా కనపడుతోంది. అయితే జగన్ – ముద్రగడలు కలిసి ఎన్ని ‘కుల చిచ్చు’ పెట్టే రాజకీయ ప్రయత్నాలు చేసినా, ప్రజలు తెలుగుదేశం పార్టీ వైపే ఉన్నారని నంద్యాల ఎన్నికల ఫలితం చెప్పకనే చెప్తోంది.

ADVERTISEMENT
Latest Stories