అసెంబ్లీ ఫలితాలు : జగన్ భాగోతం బట్టబయలు!

Jagan loses own ground in fight on the systemఏపీ శీతాకాల అసెంబ్లీ సమావేశాలు ముగిసిపోయాయి. 5 రోజుల పాటు జరిగిన ఈ సమావేశాల ద్వారా అధికార పక్షం, ప్రతిపక్షం సాధించిన విషయాలేంటి? ప్రభుత్వం మరో మూడేళ్ల పాటు అధికారంలోనే ఉంటుంది గనుక, ఏం సాధించినా, లేకున్నా పెద్దగా చెప్పుకోవాల్సింది లేదు. అయితే, అధికార ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే విధంగా వ్యూహాలు పన్ని, వాటి ద్వారా లబ్ధి పొంది ప్రజల్లో గుర్తింపు తెచ్చుకోవాల్సిన ఆవశ్యకత ప్రతిపక్షంపై ఉంటుంది. మరి ఈ విషయంలో ప్రతిపక్ష నాయకుడు జగన్ మోహన్ రెడ్డి ఎంత మేరకు సక్సెస్ అయ్యారు… అని అంటే తెల్లమొహం వేయాల్సిందే!

నిజానికి సమావేశాలు ప్రారంభం కావడానికి ముందు ‘కల్తీమద్యం, కాల్ మనీ’ అంశాలు వెలుగు చూడడంతో, అధికార ప్రభుత్వం డిఫెన్స్ లో పడింది. సరిగ్గా ఇదే అంశాలతో తెలుగుదేశం ప్రభుత్వాన్ని ఇరుకున పెడదామని భావించిన జగన్, సరైన వ్యూహం లేక బొక్కబోర్లాపడ్డారు. ‘కల్తీ మద్యం’ అంశాన్ని జగన్ పూర్తిగా విస్మరించాగా, ‘కాల్ మనీ’పై చేపట్టిన చర్చ తెలుగుదేశం ప్రభుత్వం చిత్తశుద్ధి నిరూపించుకోవడానికి ఉపయోగపడింది. ఇక, రోజా పలికిన “బూతుపురాణం”తో ఏకంగా జగన్ ఎమ్మెల్యే ఏడాది పాటు సస్పెండ్ కు గురవ్వాల్సిన పరిస్థితి నెలకొంది.

ఇవన్నీగాక, స్పీకర్ పై అవిశ్వాస తీర్మానం నోటీసులు ఇవ్వడానికి అసెంబ్లీ సమావేశాలు ముగిసిపోయే దాకా వేచిచూసారు. స్పీకర్ పై నోటీసులు ఇవ్వడానికి రెండు రోజుల చర్చలు ఏమిటో అర్ధం కాక రాజకీయ విశ్లేషకులు తలలు పట్టుకుంటున్నారు. ఇక, ఇపుడు ఇచ్చినా ప్రయోజనం లేదు. మొత్తంగా జగన్ అనుసరించిన ఒక్క వ్యూహం కూడా పార్టీకి గానీ, జగన్ ను గానీ అనుకూలంగా మారలేదు. సానుకూలం అన్నది పక్కన పెడితే, ఈ సమావేశాల ద్వారా జగన్ ‘బండారం’ బట్టబయలు కావడం… జగన్ భవిష్యత్తు రాజకీయాలకు తీవ్ర ప్రతికూల అంశమని విశ్లేషకులు తేల్చేస్తున్నారు.

‘మద్యపాన నిషేధం’ అంటూ మీడియా ముఖంగా వ్యాఖ్యానించిన జగన్, కనీసం ఈ అంశంపై పల్లెత్తు ‘మాట’ కూడా మాట్లాడకపోవడంతో… ‘మద్యపాన నిషేధం’పై జగన్ చిత్తశుద్దిని చాటుతోంది. భవిష్యత్తులో ఈ అంశాన్ని తెరపైకి వస్తే, అది జగన్ కే ‘బూంరాంగ్’ అవనుంది. ఇక, ‘కాల్ మనీ’పై చేపట్టిన చర్చలో… జగన్ వేసిన ప్రశ్నలకు అధికార పక్షం ఇచ్చిన సమాధానాలతో, ఈ కేసులో అధికార పార్టీ నాయకుల ప్రమేయం లేదని ప్రజలు నమ్మే స్థితికి వచ్చారు. మరో విధంగా చెప్పాలంటే, కాల్ మనీతో ఇబ్బందులు పడుతున్న అధికార పార్టీని జగనే స్వయంగా గట్టెక్కించారు.

ఇక, రోజాను అడ్డం పెట్టుకుని రాజకీయ ప్రయోజనం పొందాలని చూసిన జగన్, సమావేశాల నుండి ‘వాకౌట్’ అని ప్రకటించారు. అయితే తాజాగా విడుదలైన రోజా “బూతుపురాణం” వీడియోతో ఇదంతా జగన్ కనుసన్నల్లోనే జరగిందని స్పష్టమైంది. దీంతో జగన్ “భాగోతం” మొత్తం ప్రజల ముందు పెట్టినట్లయ్యింది. ముఖ్యంగా రోజా అంశంతో జగన్ ను అభిమానించే వారు కూడా విమర్శించడం మొదలు పెట్టారు. జగన్ వ్యవహార తీరుతో పార్టీ నాయకులు కూడా తలలు పట్టుకుంటున్నారు. “తానూ పట్టిన కుందేలుకు మూడే కాళ్ళు” అన్న చందంగా జగన్ వ్యవహార తీరు ఉంటోందని వాపోతున్నారట. ఈ సమావేశాలతో జగన్ ఎంత దిగజారుడు రాజకీయాలు అనుసరిస్తున్నారో మరోసారి ప్రజలకు తేటతెల్లమైంది. రానూ రానూ జగన్ రాజకీయ భవిష్యత్తు అంధకారంలోకి వెళ్ళిపోతోందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ADVERTISEMENT
Latest Stories