దేశంలో ఏ రాజకీయ పార్టీ అయినా ఓ ఆరేడు నెలల ముందు ఎన్నికలకు సన్నాహాలు చేసుకోవడం సర్వసాధారణమైన విషయం. కానీ జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రోజు నుంచే నవరత్నాలు, వైసీపి రంగులు, స్టిక్కర్లు, వాలంటీర్లు, ప్రతిపక్షాలపై కేసులు, వేధింపులు, చంద్రబాబు అరెస్ట్ వగైరా సన్నాహాలు చేసుకుని ఎన్నికలకు సిద్దంగా ఉంది.
ఈ ఎన్నికల కోసం ఇంత దూరదృష్టితో పంచవర్ష ప్రణాళికను రూపొందించుకొని అమలుచేస్తూ ముందుకు సాగుతున్నందునే, ఈసారి 175కి 175 సీట్లు మనవే అని జగన్మోహన్ రెడ్డి నమ్మకంగా చెప్పి ఉండవచ్చు. కానీ ఎన్నికలు దగ్గర పడేసరికి ఆయన సన్నాహాలు, వ్యూహాలు, ఆలోచనలు, అన్నీ బెడిసికొట్టి బూడిదలో పోసిన పన్నీరులా మారుతుండటం చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది.
ఉదాహరణకు వాలంటీర్లను సృష్టించుకుంటే వారిని అధికారికంగా వాడుకోవడానికి లేకుండా పోయింది. పోలీస్ ఉన్నతాధికారులను నమ్ముకుంటే ఈసీ వారిని ఎన్నికల విధులలో నుంచి తప్పించేస్తోంది.
సరిగ్గా ఏడాది క్రితం ‘ఈ ప్రతిపక్షాలన్నీ కలిసినా నా తల మీద ఒక్క ఈక కూడా పీకలేవని’ గొప్పగా చెప్పుకున్న నోటితోనే ‘ఈసారి ఎన్నికలు సక్రమంగా జరుగుతాయనే నమ్మకం రోజురోజుకీ తగ్గిపోతోందని’ జగన్మోహన్ రెడ్డి చెప్పుకోవడమే ఇందుకు నిదర్శనం.
జగన్ మాటలతో వైసీపి శ్రేణులు షాక్ అయ్యాయి. ఎందుకంటే, ఎన్నికలకు ముందు ఇటువంటి మాటలు ‘ఓటమిని అంగీకరిస్తూ చేసే ప్రకటనలుగానే’ పరిగణిస్తుంటారు కనుక.
నిజానికి రాష్ట్రంలో పరిస్థితులు హటాత్తుగా తమకు వ్యతిరేకంగా మారిపోయాయని జగన్మోహన్ రెడ్డికి తెలిసే ఉన్నా, ఎప్పటిలాగే నిబ్బరంగా “175 సీట్లు మేమే గెలుస్తాం. సింగిల్ సింహం, అర్జున ఫాల్గుణా, పార్ధ… పద్మవ్యూహం… అంటూ మేకపోతు గాంభీర్యం ప్రదర్శించి ఉంటే, ఇంకా గెలుస్తామనే గుడ్డి నమ్మకంతో ఉన్న వైసీపి అభ్యర్ధులు తమ ప్రయత్నాలు తాము చేసుకొని ఈ ఎన్నికలలో గట్టెక్కేందుకు ప్రయత్నించేవారు. కానీ జగన్ ఆగ్రహంతో ఊగిపోతూ, ‘నమ్మకం సన్నగిల్లిపోతోందని’ చెప్పడంతో వారి ఆత్మస్థైర్యాన్ని కూడా దెబ్బ తీసిన్నట్లయింది.
‘ఆన్ గోయింగ్ సంక్షేమ పధకాలన్నీ’ చంద్రబాబు నాయుడు ఆపించేస్తున్నారని జగన్ ఆవేశంతో ఊగిపోతూ చెప్పారు. నిజానికి చంద్రబాబు నాయుడు ఆవిధంగా చేసి ఉంటే అది వైసీపికి అడ్వాంటేజ్ అవుతుంది కానీ నష్టపోదు కదా?వాలంటీర్లతో పింఛన్లు పంపిణీ చేయడవద్దనే ఈసీ ఆదేశాన్ని వైసీపి ఎంతగా ప్రచారం చేసుకుందో అందరికీ తెలుసు. దాని వలన టిడిపికి ఎంతో కొంత నష్టం జరిగే ఉంటుంది కూడా.
కనుక ‘ఆన్ గోయింగ్’ సంక్షేమ పధకాలన్నీ చంద్రబాబు నాయుడు ఆపించేస్తున్నప్పుడు వాటి గురించి కూడా జగన్మోహన్ రెడ్డి ఎప్పటిలాగే దుష్ప్రచారం చేసుకొని ఎన్నికలలో మైలేజీ పొందవచ్చు. కానీ అంత ఆవేశంతో ఎందుకు ఊగిపోయారు?
అంటే వాటిని ఆపడం వలన కాదు… ప్రధాని నరేంద్రమోడీ, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, దగ్గుబాటి పురందేశ్వరిలు కలిసి ఒకే వేదికపైకి వచ్చినందుకు. ఇంతకాలం సాయపడిన ప్రధాని నరేంద్రమోడీ తన పాలన, ప్రభుత్వం, అవినీతి, వైఫల్యాలను ఎత్తి చూపినందుకు!
అంటే అత్త కొట్టినందుకు కాదు… తోటి కోడలు నవ్వినందుకు బాధ పడుతున్నట్లన్న మాట! ఏది ఏమైనప్పటికీ ‘ఇది మల్లెల మాసమని తొందరపడి ఓ కోయిల ముందే కూసింది’ అన్నట్లుగా జగన్ ఐదేళ్ళు ఎంతో కష్టపడి అన్నీ ప్లాన్ చేసి, పోలింగ్కు వారం రోజుల ముందు ‘తొందరపడి ఓడిపోతున్నామని చెప్పేసుకొని వైసీపిని ఆయనే ఓడించేసుకుంటున్నారు… దేవుడా ఏమిటీ స్క్రిప్ట్?






