తాడేపల్లి ప్యాలస్లో గృహ నిరబందం విధించుకున్న జగన్ సంక్రాంతి తర్వాత బయటకు వస్తానని చెపుతున్నారు. ఆలోగా పార్టీ నేతలు, కార్యకర్తలు ప్రజా సమస్యలపై పోరాడుతూ ఉండండి అంటూ డిసెంబర్ షెడ్యూల్ చేతిలో పెట్టారు.
కానీ ముఖ్యమంత్రి, మంత్రి పదవులు అనుభవించిన తమ అధినేత, నేతలు ఇంట్లో కూర్చొని సేద తీరుతుంటే, వారి కోసం తాము రోడ్లపై ధర్నాలు దీక్షలు చేసి పోలీస్ కేసులలో ఇరుక్కోవాలా అని పార్టీ కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారు. పైగా ధర్నాలు, దీక్షలకు పార్టీ తరపున కానీ ఆయా జిల్లా, నియోజకవర్గంలో వైసీపీ నేతలు గానీ ఎవరూ దమ్మిడీ విధిలించకపోవడాన్ని కూడా వైసీపీ కార్యకర్తలు తప్పు పడుతున్నారు.
ఒకవేళ కార్యకర్తలు ఎవరైనా జగన్మోహన్ రెడ్డిని కలిసి తమ సమస్యలు చెప్పుకోవడానికి తాడేపల్లి ప్యాలస్కు వెళితే సిబ్బంది ప్యాలస్లు దారిదాపులకి కూడా రానీయకుండా తరిమేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మళ్ళీ ఎప్పటిలాగే సజ్జల రామకృష్ణ రెడ్డి వంటివారు జగన్ చుట్టూ చేరి కోటరీగా ఏర్పడి, జగన్కి పార్టీ నేతలకు, కార్యకర్తలకు మద్య అడ్డుగోడగా మారారని ఆరోపిస్తున్నారు.
ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎలాగూ తమకి జగన్మోహన్ రెడ్డి దారిదాపులకి వెళ్ళే అవకాశం ఉండేది కాదని, ఎన్నికలలో ఒడిపోయినా జగన్ తమకు ఎందుకు దూరంగా ఉంటున్నారని కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారు.
టీడీపీ, జనసేనలు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, పవన్ కళ్యాణ్ ముగ్గురూ ఏవిదంగా నిత్యం ప్రజలు, కార్యకర్తల మద్య తిరుగుతూ కలిసి పోరాడేవారో గుర్తు చేసుకుంటూ, తమ అధినేత జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి ప్యాలస్ వదిలి బయటకు ఎందుకు రావడం లేదని ప్రశ్నిస్తున్నారు. కానీ వారి కంఠశోషే తాడేపల్లి ప్యాలస్ లోపల సేద తీరుతున్న జగన్ చెవిలో పడే అవకాశం లేదు. కనుక జనవరిలో సంక్రాంతి తర్వాత అధినేత బయటకు వచ్చేవరకు ఎదురుచూడక తప్పదు!




