అదృష్టం కలిసివస్తే డబ్బు అధికారం రావచ్చేమో కానీ గౌరవం మాత్రం ఫ్రీగా రాదు. అది ఎవరికి వారు కష్టపడి సంపాదించుకోవలసిందే. జగన్కు ప్రజలు ఒక్క ఛాన్స్ ఇచ్చినప్పుడు ఆ అవకాశం లభించింది కూడా.
అయితే తాను ఎన్ని అక్రమాలు, అవినీతిపనులు చేసినా ప్రజలకు డబ్బులు పంచిపెడుతున్నాను గాబట్టి వారి దృష్టిలో తన గౌరవం అలా అలా… పెరిగిపోతూనే ఉంటుందనే గుడ్డి భ్రమలోనే ఎన్నికలకు వెళ్ళిపోయి బోర్లాపడ్డారు.
175కి 11 మార్కులు అంటే జగన్కి ప్రజలు కనీసం పాస్ మార్కులు కూడా వేయలేదన్న మాట! అయితే ప్రజాస్వామ్య పరీక్షలో ఫెయిల్ అయిన విద్యార్ధి జగన్కి మళ్ళీ వ్రాసేందుకు సప్లిమెంటరీ కూడా లేదు. ఐదేళ్ళు ఓపిక పట్టాల్సిందే. ఆలోగా ఎందుకు ఫెయిల్ అయ్యారో తెలుసుకొని అన్నీ రివైజ్ చేసుకోవలసిందే.
కానీ 175 సీట్లు మనవే అంటూ పార్టీ నేతల కళ్ళకు గంతలు కట్టి గోతిలో పడేసిన జగన్, నేటికీ ఆ గోతిలో నుంచి తాను బయట పడాలని ప్రయత్నించడం లేదు. ఆ గోతిలోనే మనమందరం సురక్షితంగా, నిశ్చింతగా ఉందామని చెపుతున్నారు. ఢిల్లీ ధర్నా అటువంటిదే.
కేవలం 11 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్న తనకు శాసనసభలో ప్రధాన ప్రతిపక్ష నేత హోదా ఇవ్వాలని జగన్ అడగడమే తప్పు… సిగ్గుచేటు!
స్పీకర్ చేత ‘నో’ అనిపించుకున్నాక కూడా జగన్ ఏమాత్రం సిగ్గుపడలేదు. దాని కోసం హైకోర్టులో పిటిషన్ వేశారు. అంటే అవమానం ఇంకా సరిపోలేదన్న మాట!
జగన్ తరపున పిటిషన్ పడింది కనుక దానిని హైకోర్టు విచారణకు స్వీకరించి స్పీకర్, అసెంబ్లీ కార్యదర్శులను కౌంటర్ దాఖలు చేయమని కోరుతూ నోటీస్ పంపింది.
అయితే ప్రతిపక్షానికి ఆ హోదా ఇవ్వాలో వద్దో నిర్ణయించేది స్పీకర్ తప్ప న్యాయస్థానాలు కావు. ముఖ్యంగా ఇలాంటి విషయాలలో న్యాయస్థానాలు జోక్యం చేసుకోవు కూడా.
కనుక దీనిపై కోర్టులో విచారణ జరిగితే జగన్కి ఇంకా అవమానం కలుగుతుంది. అదీ సరిపోదనుకుంటే సుప్రీంకోర్టుకి కూడా వెళ్ళి అక్కడా నవ్వుల పాలవవచ్చు.
కానీ జగన్ ఆలోచన మరోలా ఉంది. ఢిల్లీలో ధర్నా చేయడం గొప్ప విషయంగా భావిస్తున్నట్లే, తాను ఈ అంశంపై కూడా గొప్పగా న్యాయపోరాటం చేస్తున్నానని, తద్వారా మీడియా ఫోకస్, ప్రజల ఫోకస్లో ఉంటానని జగన్ అనుకుంటున్నట్లున్నారు.
ఎవరైనా గౌరవం సంపాదించుకోవాలని ప్రయత్నిస్తారు. కానీ జగన్ మాత్రం ఇలా ప్రవర్తిస్తూ ‘రాజకీయ జోకర్’లా అందరినీ అలరిస్తూ తాను మాత్రం నవ్వులపాలయ్యేందుకు ఇలా దారులు వెతుక్కుంటున్నారు… గ్రేట్!




